ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయి. గత 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు వచ్చాయి. మొత్తం 13సీట్లలో 8చోట్ల విజయం సాధించింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్ఎస్, సీపీఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు సాధించింది. అందులో కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 4, సీపీఐ ఒకటి గెలిచాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కటే 8 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి సత్తాచాటుకుంది. ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలను కైవసం చేసుకుని క్లీన్స్వీప్ చేసింది. ఇక పొరుగునే ఉన్న ధర్మపురితో పాటు వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్నూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్తో కలిపి ఐదు స్థానాలకే పరిమితమైంది. ఇటు హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో ఘోర పరాజయం మూటకట్టుకున్నారు.
కరీంనగర్లో విజయం చివరి వరకు దోబూచులాడింది. చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై విజయం సాధించారు. 32 వేల 365ఓట్ల తేడాతే గెలిచారు. చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం.. ప్రతీ రౌండ్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై ఆధిపత్యం చూపించారు. 37వేల 439 ఓట్ల తేడాతో గెలుపొందారు మేడిపల్లి సత్యం. హుజూరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తమ ప్రత్యర్థులు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు. 16వేల 873 ఓట్ల తేడాతో ఈటలపై గెలుపొందారు. గత ఉప ఎన్నికల్లో 3వేల ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్.. ఈసారి ఏకంగా 53వేలకు పైగా ఓట్లను రాబట్టింది.
మంథని నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్బాబు 31వేల 380 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై విజయం సాధించారు. రామగుండం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ 56వేల 794 ఓట్ల తేడాతో కోరుకంటి చందర్పై గెలుపొందారు. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు 55వేల 108ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డిపై విజయం సాధించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడుతున్నారు. అయితే ఈసారి మెజారిటీ చాలా తగ్గింది. మహేందర్ రెడ్డిపై 29వేల 687 ఓట్ల తేడాతో గెలిచారు కేటీఆర్.
వేములవాడలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్ రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 14వేల 581 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
జగిత్యాలలో తొలుత జీవన్రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. ఆ తర్వాత వెనుకబడ్డారు. ఈ నిజయోకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ను ఓడించారు. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి. కాంగ్రెస్ హవా, లక్ష్మణ్పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి. 22వేల 39 ఓట్ల తేడాతో కొప్పులపై గెలిచారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్ కుమార్పై19వేల 344 ఓట్ల తేడాతో గెలుపొందారు.
.
.