దేశంలో GST వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది GST చరిత్రలో రెండో అత్యధిక వసూలు. నిరుటితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 16.6 శాతం మేర పెరిగాయి.
అక్టోబర్ లో మొత్తం రూ.1,51,718 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిరుడు ఇదే నెలలో రూ.1.3 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. తాజా వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.26,039 కోట్లు.. ఎస్జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు వసూలైందని… ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు సమకూరిందని వెల్లడించింది. ఇక సెస్సుల రూపంలో రూ.10,505 కోట్లు వసూలైందని తెలిపింది.
ఇక ఓవరాల్ గా చూస్తే… జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధిక GST వసూలైంది. ఆ నెలలో ఏకంగా రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. GSTలో మరో రికార్డ్ కూడా నమోదైంది. వరుసగా 9వ నెలలో రూ.1.4 లక్షల కోట్లపైన జీఎస్టీ వసూలైంది. GST అత్యధికంగా వసూలైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. అక్టోబర్ లో మహారాష్ట్ర నుంచి ఏకంగా రూ.23,037 కోట్ల GST వసూలైంది. నిరుడు అక్టోబర్ లో రూ.19,355 కోట్లే రాగా… ఈ ఏడాది 19 శాతం వృద్ధి నమోదైంది.
ఇక GSTలో తెలుగు రాష్ట్రాల వాటా చూస్తే… ఏపీలో అక్టోబర్ లో రూ.3,579 కోట్లు వసూలైంది. గత అక్టోబర్ లో వచ్చిన రూ.2,879 కోట్లతో పోలిస్తే ఈసారి వసూళ్లు 24 శాతం వృద్ధి చెందాయి. ఇక తెలంగాణలో ఈ అక్టోబర్ లో రూ.4,284 కోట్ల GST వసూళ్లు జరిగినట్లు కేంద్రం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ లో వసూలైన రూ.3,854 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం అధికంగా తెలంగాణలో GST వసూలైంది.