తమ కంచుకోటగా భావించే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హస్తంపార్టీ విజయదుందుభి మోగించింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజ నేతలంతా ఈ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. రాజకీయ కాంగ్రెస్ ఉద్దండులు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ స్థానాలతోపాటు తమ అనుచరులు కూడా గెలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కేవలం ఒకే ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది.. ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఎన్నిక ఏక పక్షంగా సాగింది.
సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ నుంచి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై జగదీష్ రెడ్డి 4వేల 606 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలోనే నకిరేకల్లో కాంగ్రెస్కు అత్యధిక మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి వేముల వీరేశానికి 68వేల 839 ఓట్ల మెజారిటీ దక్కింది. బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు వేముల వీరేశం. ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతపై 49వేల 656 ఓట్ల తేడాతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిపై.. 25వేల 761 ఓట్ల తేడాతో గెలిచారు.
మునుగోడులో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు. 40వేల 138 ఓట్ల తేడాతో గెలుపొందారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దేవరకొండలో కాంగ్రెస్ నుంచి బాలూనాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్పై 30వేల 140 ఓట్ల తేడాతో గెలిచారు. నాగార్జునసాగర్లో కాంగ్రెస్కు చెందిన కుందూరు జైవీర్ రెడ్డి , బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్పై విజయం సాధించారు. 55వేల 849 ఓట్ల తేడాతో గెలుపొందారు జైవీర్. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావుపై 48వేల 782 ఓట్ల తేడాతో గెలిచారు.
హుజూర్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవగా ఆయన చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓడిపోయారు. 43వేల 959 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉత్తమ్కుమార్ రెడ్డి. ఇటు కోదాడలో కాంగ్రెస్ నుంచి ఎన్.ఉత్తమ్ పద్మావతి విజయం సాధించగా ఆమె చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఓటమిపాలయ్యారు. 57,861వేల ఓట్ల తేడాతో బొల్లం మల్లయ్యను పద్మావతి ఓడించారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి మందుల సామేలు, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ పై గెలిచారు. 51వేల 94 ఓట్ల తేడాతో గెలుపొందారు మందుల సామేలు. నల్గొండలో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి విజయం సాధించగా, ఆయన చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 54వేల 332 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
2014 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో బీఆర్ఎస్ ఆరు, కాంగ్రెస్ ఆరు స్థానాలను కైవసం చేసుకొని సమానంగా నిలిచాయి. 2018 ఎన్నికల్లో మాత్రం 9 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజ నాయకులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు పరాజయం పాలయ్యారు. తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచింది. 2014, 2018 ఎన్నికల్లో ఘోరం పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకుని తన ప్రతీకారాన్ని తీర్చుకుంది.
.
.