Mizoram Elections Result: మిజోరాం అసెంబ్లి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 174 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ అయినా 21 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే.. మిజోరాం లో ఈసారి జెడ్ పీఎం 28-35 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎంఎన్ఎఫ్ కు 3-7 సీట్లు, కాంగ్రెస్ కు 2-4 సీట్లు మాత్రమే వస్తాయని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన మీజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎమ్), కాంగ్రెస్.. మొత్తం 40 సీట్లలోనూ అభ్యర్థులను నిలబెట్టగా.. బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి 4 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా.. 17 మంది స్వతంత్ర అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఆదివారమే రావాల్సింది. కానీ.. ఇక్కడ క్రిస్టియన్లు మెజారిటీగా ఉండటంతో.. ఆదివారం ప్రార్థనలకు ఉన్న ప్రత్యేకతను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఓట్ల లెక్కింపును సోమవారానికి వాయిదా వేసింది.
2018 నాటి ఎన్నికలను చూస్తే.. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలిచి కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. జెడ్పీఎం 8 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 5 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమైంది. బీజేపీ 1 సీటుతో బోణీ కొట్టింది.