యశస్విని రెడ్డి.. రాజకీయాల్లో యువ కెరటం. ఎమ్మెల్యేకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరి కంటే వయసులో చిన్న. అయితేనేం.. తొలి పోటీలోనే తన సత్తా చాటారు. రాజకీయాల్లో నిలబడాలంటే వయసుతో సంబంధం లేదు… కరేజ్ సరిపోతుందని నిరూపించారు. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ చూసిన ఎర్రబెల్లిని ఓ 26 ఏళ్ల యువ నాయకురాలు ఓడించడం అంటే మాటలు కాదు. రాజకీయాలకు కొత్తే అయినా ప్రచారాలను యశస్విని హోరెత్తించారు. ఎర్రబెల్లిని ఇంటికి పంపించారు.
పాలకుర్తిలో అనుకున్నదే జరిగింది. సీనియర్ పొలిటీషియన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అతిచిన్న వయస్కురాలైన యశస్విని రెడ్డి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. తొలి నుంచి హోరాహోరీగా తలపడిన యశస్విని రెడ్డి తొలి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగించారు. మొదటి నుంచి ఎదురీతను ఎదుర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. చివరిగా ప్రత్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన ప్రత్యర్థి 26 సంవత్సరాల యశస్విని రెడ్డి దాటికి తట్టుకోలేకపోయారు. ప్రచారం నాటి నుంచి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసినా మంత్రి ఎర్రబెల్లిని ప్రజలు ఆదరించలేదు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనే ప్రజల నుండి ఆయన తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల, మంత్రి దయాకర్ రావు పైన స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా మారిందని, అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఎన్నారై కాగా, ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయిందని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యశస్విని రెడ్డి వయసు 26 ఏళ్లు.. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు.. అనూహ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. యశస్విని రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు. యశస్విని వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు.
నిజానికి, ఎన్నారై ఝాన్సీరెడ్డికి టికెట్ ఖాయమైంది. ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులొచ్చాయి. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ వ్యూహం మార్చేసింది. ఝాన్సీకి బదులుగా ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయం చేసింది. ఆమె అనూహ్యంగా తన అత్త బదులుగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణ ఎన్నికల్లో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై యశస్విని పోటీకి దిగడంతో.. ఆమె విజయం సాధిస్తారా అనే అనుమానాలు కలిగాయి. అనూహ్యంగా పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించి.. ఎర్రబెల్లికి షాకిచ్చారు.