KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. 41 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 3 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుస్తారనుకున్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా.. విజయం కాంగ్రెస్ దే అన్న క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వెల్లడైన ఎన్నికల ఫలితాలను చూసి బాధపడలేదు కానీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందామన్నారు. ఈ ఓటమిని ఒక పాఠంగా స్వీకరిస్తున్నామని, తిరిగి మళ్లీ పుంజుకుంటామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. అలాగే మీకు శుభం జరగాలి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా.. శనివారం రాత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. గురి తప్పిందన్నారు.