Sky in Mongolia : మంగోలియాలో ఆకాశం ఒక్కసారిగా ఎరుపు రంగును సంతరించుకుంది. చిక్కటి రెడ్ బ్లడ్ రంగులోకి నింగి ఆకస్మికంగా మారిపోవడాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అరోరల్ పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన దృశ్యం ఆవిష్కృతమైనట్టు చెబుతున్నారు.
భూమిని సౌరతుఫాను తాకినప్పుడు ఆకాశం రంగు మారుతుంది. దీనిని ‘అరోరా బొరియాలిస్’గా వ్యవహరిస్తారు. సూర్యుడి నుంచి వచ్చిన కణాలు భూవాతావరణంతో ఢీకొన్నప్పుడు అరోరా బొరియాలిస్ ఏర్పడుతుంది. వీటిని ఉత్తర వెలుగులు (నార్తర్న్ లైట్స్) అని కూడా అంటారు.
ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర.. ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతి రూపాన్ని ఇది కలిగి ఉంటుంది.అయితే మంగోలియాలో కనిపించిన అరోరా మరింత చిక్కటి వర్ణంలో ఉంది. భూఉపరితలానికి అత్యంత ఎత్తులో.. అంటే 241 కిలోమీటర్ల ఎగువన.. పల్చగా ఉన్న వాతావరణంతో సూర్య కణాలు ఢీకొనడం వల్లే ఆకాశం క్రిమ్సన్ రెడ్ను సంతరించుకుందనే అభిప్రాయం ఉంది.
ఇలాంటి ఎరుపు వర్ణం నార్తర్న్ లైట్స్లో కనిపించడం అత్యంత అరుదు. ప్రస్తుతం సౌర తుఫాను వల్ల మంగోలియాలో ఆకాశం రంగు మారిందని చెబుతున్నారు. సూర్యుడి నుంచి గత వారం కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CMEs) వెలువడ్డాయి. ఈ సౌరతుఫానులో భాగంగా తొలి వేవ్ గత నెల 29న భూమిని తాకింది. సౌర కణాలు భూవాతావరణంతో ఢీకొనడం వల్ల ఎరుపు అరోరా ఏర్పడిందని చెబుతున్నారు.
తక్కువ ఎత్తులో సౌర తుఫాన్లు తాకినప్పుడు కలిగే ప్రభావాలను అధ్యయనం చేయడానికి మంగోలియాలో ఏర్పడిన అరోరా శాస్త్రవేత్తలకు ఓ అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది మరింత తీవ్రంగా సౌర తుఫాన్లు భూమిదిశగా వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు ఇలాంటి అరోరాలు మరిన్ని ఏర్పడేందుకు అవకాశం ఉండొచ్చు. సౌరతుఫాన్ల వల్ల రేడియో, జీపీఎస్ సిగ్నళ్లకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది.