Telangana Election Results : తెలంగాణలో వీచిన కాంగ్రెస్ గాలిలో కొందరు మంత్రులు గల్లంతయ్యారు. నిర్మల్ లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు స్థానికంగా మంచి పట్టుంది. త్రిముఖ పోరులో మహేశ్వర్ రెడ్డి విజయం సులువైంది.
పాలకుర్తిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థి యశస్వినిరెడ్డిని బరిలోకి దించింది. నియోజకవర్గ ఓటర్లు ఆమెను ఆదరించారు. ఎర్రబెల్లికి తొలిసారిగా ఓటమి రుచి చూపించారు.
వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరాజయం చవిచూశారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి విజయభేరి మోగించారు. తొలుత జి.చిన్నారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. చివరి నిమిషంలో ఆయన స్థానంలో మేఘారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. ఈ మార్పు మంచి ఫలితాన్ని ఇచ్చింది. స్థానికంగా అప్పటికే యాక్టివ్ గా పనిచేస్తున్న మేఘారెడ్డికి ప్రజల్లో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆయన బరిలోకి దించింది. ప్రజలు మేఘారెడ్డికి పట్టం కట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డిని ఇంటికి పంపారు.
ధర్మపురిలో సాంఘిక్ష సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. ఆయనపై 2018 ఎన్నికల్లో కేవలం 141 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓడిపోయారు. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ పై లక్ష్మణ్ 22,039 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మహబూబ్ నగర్ లో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఓటర్లు షాకిచ్చారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు.
ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు ఓటమి దిశగా పయనిస్తున్నారు. పువ్వాడపై కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ ఆధిక్యంలో ఉన్నారు.
మంత్రుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు విజయం సాధించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ముగ్గురు మంత్రులు కూడా విజయం సాధించారు. సికింద్రాబాద్ లో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గెలిచారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని విజయం వరించింది.