Congress Celebrations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే.. కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. అశ్వారావుపేట విజయంతో కాంగ్రెస్ బోణీ కొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఇంతవరకూ ఒక్కరు కూడా విజయం సాధించలేదు. కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. పోలింగ్ కేంద్రాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు.
హైదరాబాద్ లో తెలంగాణ భవన్ వెల వెల బోతుండగా.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి కాంగ్రెస్ అధిక్యం చూపిస్తూనే ఉంది. ఏ దశలోను తగ్గకుండా దూసుకుపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్ధులు చాలా చోట్ల వెనుకబడిపోయారు. ఏ స్థాయిలో కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. గాంధీభవన్లో సంబరాలు షురూ అయ్యాయి. టపాసులు కాల్చుతూ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకెళ్తుంది. కచ్చితంగా కాంగ్రెస్సే గెలుస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేతలంతా గాంధీభవన్కు చేరుకున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వెల్లడవుతున్న ఫలితాలు గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. కారు గుర్తు వర్గీయులు ఊహకందని ఫలితాలతో కకావికలమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం ఖాయమని తేలడంతో బీఆర్ఎస్ నైరాశ్యంలో కూరుకుపోయింది. ఎప్పుడూ కళకళలాడే తెలంగాణ భవన్ బోసిపోతోంది. బడా నాయకులతో పాటు చోటామోటా కార్యకర్తలెవరూ పార్టీ కార్యాలయం దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. మీడియా ముందు ఏం సమాధానం చెప్పాలో తెలియక ముఖం చాటేస్తున్నారని అనుకుంటున్నారు.
కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో.. X వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైందంటూ పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి..గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దాదాపు విజయం ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఇంటివద్ద, గాంధీభవన్ దగ్గర సంబరాలు మిన్నంటాయి. ఇదే క్రమంలో రేవంత్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవతోంది.
ఎన్నికల ఫలితాల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండటంతో సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ ముందు టపాసులు కాల్చి, నృత్యాలు చేశారు. బైబై కేసీఆర్ అంటూ విద్యార్థులు నినదించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైంది. సర్వే అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. 74 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ మంత్రులంతా దాదాపు ఓటమి బాటలో ఉన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది.