Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ 70 స్థానాలు కచ్చితంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి ఫలితంలో కాంగ్రెస్ అభ్యర్థే గెలిచారు. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 20 వేలపైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 2018లో అశ్వారావుపేటలో టీడీపీ తరఫున పోటీ చేసి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ ఫిరాయించారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఓటమిపాలయ్యారు.
మరోవైపు తెలంగాణలో చాలామంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికే పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఓడిపోయారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వనపర్తిలో నిరంజన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. సూర్యాపేటలో జగదీశ్రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ఓటమి దిశగా పయనిస్తున్నారు.