Palakurthi : ఆయన వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ కొట్టారు. తనకు తిరుగేలేదనుకున్నారు. 7వ సారి విజయంపై రెండు నెలల ముందు వరకు ధీమాగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగానే ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. ఆ నేతే ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు పాలకుర్తిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు మూడుసార్లు వరుసగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. దీంతో ఎర్రబెల్లి పాలకుర్తికి మారారు. అక్కడ నుంచి 2009, 2014లో టీడీపీ తరఫున 2018లో బీఆర్ఎస్ తరఫున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. రెండు నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కానీ ఈసారి ఎర్రబెల్లి ఓటమి ఖాయమని ముందే తేలిపోయింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాలకుర్తిపై ప్రత్యేక ఫోకస్ చేశారు. అక్కడ నుంచి హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని బరిలోకి దించాలని భావించారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ఎత్తుగడలు వేశారు. ఆమెకు భారత పౌరసత్వం రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఝాన్సీరెడ్డి కోడలు యశస్వినిరెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. 26 ఏళ్ల యశస్వినిరెడ్డి తన వాక్ చాతుర్యంతో పాలకుర్తి ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ కుటుంబం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చిందని ప్రజలకు వివరించారు. తమను గెలిపిస్తే పాలకుర్తికి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పారు.
హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కుటుంబ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలను పాలకుర్తిలో చేపట్టింది. ఆ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఎర్రబెల్లి ప్రయత్నించారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ బీఆర్ఎస్ నేతకు ప్రతికూలంగా మారాయి. ఆయన కుడిభుజం లాంటి నేతలు ఎన్నికలకు ముందుకు షాకిచ్చారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సమయంలో పాలకుర్తికి కేసీఆర్ ను రప్పించి బహిరంగ సభ పెట్టారు. ఆ ప్రచారం బెడిసికొట్టింది. పాలకుర్తికి హామీలు ఇవ్వాలని సీఎంను ఎర్రబెల్లి వేడుకున్నారు. ఇది కూడా ఎర్రబెల్లికి మైనస్ గా మారింది. ఇన్నాళ్లూ ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదని ప్రజల్లో చర్చ జరిగింది.
మరోవైపు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టిన రేవంత్ రెడ్డి.. ఎర్రబెల్లిని ఓడించాలని సంకల్పించారు. తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి కారణమని చెప్పారు. ఆయనను ఓడించడమే తన లక్ష్యమని పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో స్పష్టంచేశారు. ఇలా ఎర్రబెల్లిని ఇంటికి పంపేందుకు కాంగ్రెస్ పన్నిన వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. యశస్వినిరెడ్డికి భారీ విజయం సాధించారు.
.
.