India vs Australia for 5th T20 : ఆసిస్ తో జరగనున్న ఆఖరి టీ 20లో టీమ్ ఇండియా రెండు ప్రయోగాలు చేయనుంది. అంతేకాకుండా బెంగళూరు వేదికగా ఆదివారం జరగనున్న నామమాత్రం మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఘనంగా ముగింపు పలకాలని ఆశిస్తోంది. ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో ఓటమి పాలవడం వారికి చేదు మాత్ర మింగినట్టే ఉంది. దాంతో పోయిన పరువును నిలబెట్టుకునేలా ఆఖరి మ్యాచ్ లోనైనా విజయం సాధించి, ఎంతో కొంత మర్యాదగా స్వదేశం వెళ్లాలని ఆసిస్ చూస్తోంది.
రాయ్ పూర్ లో జరిగిన టీ 20 మ్యాచ్ లో ఒక మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకొని దిగ్విజయంగా సిరీస్ ని కైవసం చేసుకున్న టీమ్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. అయితే బెంగళూరు మైదానం చిన్నది కావడంతో మరోసారి పరుగుల వరద ప్రవహించే అవకాశాలున్నాయి. సిక్స్ లు, ఫోర్లు అలవోకగా వస్తాయని అంటున్నారు. ఇది అభిమానులకు కనుల పండువేనని అంటున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి మళ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగే ఆటను చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
ఈ సిరీస్లో టీమ్ ఇండియాలో ఇప్పటికే 15 మంది ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కింది. మరో ఇద్దరికి మాత్రం ఒక్క అవకాశం కూడా రాలేదు. వారెవరంటే పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. వీరిద్దరూ బెంచ్ కే పరిమితమయ్యారు. వీరిని చివరి మ్యాచ్లో ఎలాగైనా ఆడించాలని హెడ్ కోచ్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమ్ మేనేజ్మెంట్ గట్టిగా భావిస్తోంది. గత నాలుగు మ్యాచ్లు ఆడని వీరికి అంతర్జాతీయ అనుభవం రావాలని అనుకుంటున్నారు. అయితే వీరు వస్తే జట్టు సమీకరణాలు దెబ్బతినేలా ఉన్నాయి.
అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్లపై వేటు పడే అవకాశాలున్నాయి. వీరిద్దరూ పవర్ ప్లే లో వికెట్లు తీసుకుంటున్నారు. అది జట్టుకెంతో ఉపయోగంగా ఉంది. ఇప్పుడు టీమ్ ఇండియా విజయంలో వీరి పాత్ర చాలా కీలకంగా మారింది. ఒకవేళ పవర్ ప్లేలో ఓపెనర్లను వదిలేస్తే మాత్రం తర్వాత ఆసిస్ ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో టీమ్ ఇండియా బౌలర్లను వీర ఉతుకుడు ఉతకడం ఖాయమని అంటున్నారు. అందుకని వీరిద్దరిలో అటు బ్యాటింగ్ కూడా చేయగల అక్షర్ ను ఉంచి, బిష్ణోయ్ ని తీయాల్సి ఉంటుంది. మరొకరి కోసం ఓ బ్యాటర్ను కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరేం జరుగుతుందో బెంగళూరు గ్రౌండ్ లోనే చూడాల్సి ఉంది.