Telangana Election Results: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి 49 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేయగా, ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి. అలాగే ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. సూక్ష్మ పరిశీలకుడు, కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. ఈ ముగ్గురితో పాటు కంట్రోల్ యూనిట్లను టేబుల్ పైకి తీసుకొచ్చేందుకు ఒక క్యారీమెన్ సేవలందిస్తారు. రౌండ్ల వారిగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కౌంటింగ్ అసిస్టెంట్ నమోదు చేస్తారు. టేబుల్స్ పై ఉన్న కంట్రోల్ యూనిట్లలోని ఓట్ల లెక్కింపు పూర్తయితే దానిని ఒక రౌండ్ గా భావిస్తారు.
ఓట్ల లెక్కింపులో ఉన్న కంట్రోల్ యూనిట్ల బ్యాటరీలు పనిచేయకపోయినా, మొరాయించినా వాటిని పక్కన ఉంచి.. మిగతా కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో మొరాయించిన వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కించిన తర్వాత గెలిచిన పార్టీ, అభ్యర్థిని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్థారిస్తారు. రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి ధృవపత్రం అందజేస్తారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించనున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసులలో ఉన్నవారు, దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులతో కలిపి.. మొత్తం 2.20 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వేశారు. తెలంగాణ ఎన్నికల్లో బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థులు 2290 మంది ఉండగా.. వీరిలో 221మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్, మిగతావారు పురుష అభ్యర్థులు ఉన్నారు.