Congress Vyuham: తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతడం పక్కా అన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్కు ఎగ్జిట్పోల్స్ మరింత నమ్మకాన్ని పెంచాయి. అయితే కొన్ని సంస్థలు హంగ్ తప్పదంటూ రిపోర్ట్ ఇవ్వడంతో కాంగ్రెస్ అలర్టైంది. బేరసారాలు చేయడంలో దిట్టగా పేరు గాంచిన గులాబీ నేతల వ్యూహాలకు చిక్కకుండా పద్మవ్యూహాన్ని రచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే ట్రబుల్ షూటర్, నమ్మకానికి మారుపేరుగా మారిన డీకే శివకుమార్ను రంగంలోకి దించింది.
ఇప్పటికే ప్రస్తుత అధికార బీఆర్ఎస్ పార్టీ దూతలు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో టచ్లోకి వెళ్తున్నారని కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కుండబద్ధలు కొట్టారు. ఇదొక్కటే కాదు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ అస్సలు చాన్స్ తీసుకునే ఉద్ధేశంలో లేదు. అందుకే కరడు గట్టిన కాంగ్రెస్ నేతలను రంగంలోకి దింపింది ఆ పార్టీ అధిష్టానం.
నవంబర్ 30న జరిగిన పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అధికారం కాంగ్రెస్దే అని ఘంటాపథంగా చెప్పాయి. పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని.. కొన్ని సంస్థలు వెల్లడించగా.. హంగ్ వస్తుందని చాలా తక్కువ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తాజా పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచింది. గెలిచిన తర్వాత పార్టీ అభ్యర్థులు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది.
ట్రబుల్ షూటర్గా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. ఎన్నికల ఫలితాల మానిటరింగ్తో పాటు.. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునే బాధ్యతలను ఆయనకు అప్పగించినట్టుగా తెలుస్తోంది.
ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ… అలాకాని పక్షంలో బేరసారాలను అవకాశం ఉంది. దాంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల… కౌంటింగ్ కేంద్రాలు దాటి రావొద్దని ఏఐసీసీ ఆదేశించింది. ప్రతి అభ్యర్థి వెంట ఒక ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు. వీరిని కూడా కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని అధిష్టానం చెప్పింది.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు… ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మరోవైపు కౌంటింగ్ రోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్లో ల్యాండ్ కానున్నారు. ఈసారి ఏది ఏమైనా ఒక్క అభ్యర్థి కూడా చేజారకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్.