Telangana Elections 2023: ఈసారి తెలంగాణ ఎన్నికలు గతంలో లేనంత రసవత్తరంగా కొనసాగాయి. ఎన్నికల్లో సరికొత్త ట్రెండ్ కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు బరిలో దిగారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల నుంచి దాదాపు 100 మందికి పైగా కొత్తగా, మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల పోటీలో దిగారు. రాజకీయ నేతల వారసులతో పాటు ఎన్నారైలు, డాక్టర్లు, ప్రభుత్వ మాజీ ఉద్యోగులే కాక సోషల్ మీడియాలో ఫేమస్ ఫేసులు, విద్యార్థులు కూడా తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరికి ఆశ, మరికొందరికి ఆశయం, ఇంకొందరికి వారసత్వ ఆసక్తితో పాటు అదృష్టం కలిసి వస్తే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీరంతా సిద్ధపడ్డారు.
అయితే, గత రెండు ఎన్నికల్లో కనిపించని విధంగా ఈసారి భారీ స్థాయిలో కొత్త తరం అభ్యర్థులుగా ముందుకొచ్చారు. అటు ఓటర్లలో సైతం ఇంతకుముందు లేని వాతావరణం కనిపిస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయి. ఈ పరిణామంతో అధికార బిఆర్ఎస్లోనూ కాస్త కలవరపాటు కనిపింస్తోదన్న నివేదికలున్నాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యమ నినాదంతో అన్ని పార్టీలు పోటీ చేశాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ ఆ పార్టీ వర్గాలు రంగంలోకి దిగితే.. తెలంగాణ తెచ్చింది నేనే అంటూ కేసిఆర్ ప్రజల్లో ఎమోషన్ జొప్పిచ్చారు. కాగా.. నూతన తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లు కేసీఆర్కే జై కొట్టారు. దీనితో పాటు, తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువత పనిచేయడంతో రాజకీయాల్లో కొత్త నేతలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అప్పట్లో అది భారీగా వర్కౌట్ అయింది. 2018 శాసనసభ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఎత్తుగడల ముందు విపక్షాలు నిలబడలేకపోయాయి.
ఇక, 2019 లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదాన్ని ఎంచుకొని ఉద్యమ నాయకులను మాత్రం పక్కన పెట్టేశారనే విమర్శను ఎదుర్కున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయా పార్టీల నేతలు ట్రెండ్కు తగ్గట్లు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాగా, ఉద్యమ నాయకుల్ని వదిలేసి, పేరూ పలుకుబడి ఉన్న కాంగ్రెస్, టిడిపి నాయకులను బీఆర్ఎస్ చేరదీసింది. బంగారు తెలంగాణ కోసం అనుభవం ఉన్న నాయకులు అవసరమనే పేరుతో టిక్కెట్లు కట్టబెట్టారు. మొత్తానికి ప్రజామోదం పొందిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు కథ వేరు. తెలంగాణ ప్రజానికంలో ఏదో వెలితి సుస్పష్టంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు కూడా ఒప్పుకున్నారు. కాగా, గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసింది.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ, గత రెండు ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, 2023 ఎన్నికల్లో బలమైన వ్యూహంతో ఎన్నికల యుద్ధంలో అడుగుపెట్టింది. పార్టీలో సమూలంగా మార్పులు చేపట్టింది. సీనియర్లను పోగొట్టుకోకుండానే, కొత్తవారికి అవకాశమివ్వాలని సంకల్పించింది. ఆర్థికంగా బలమైన అభ్యర్థులతో పాటు, సామాజికంగా ప్రభావితం చేసే అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో దించింది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ సైతం తీవ్రంగా కష్టపడి, గట్టీ పోటీ ఇవ్వాలనే కసితో, వివిధ రంగాల ప్రముఖులతో పాటు అవకాశమున్నంత వరకూ యువతకు సీట్లిచ్చింది. అయితే, ఈసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్లనే నమ్ముకొని అందరికంటే ముందుగానే అభ్యర్థుల లిస్ట్ను కాన్ఫిడెంట్గా ప్రకటించింది. ఆట మార్చిన కాంగ్రెస్ మాత్రం కొత్త తరానికి పెద్దపీట వేసింది. అందుకే గత రెండు ఎన్నికల్లో చూడని కొత్త అభ్యర్థులు ఈ సారి భారీగా కనిపించారు.
అదే సమయంలో తమను తాము నిరూపించుకోవాలనే పట్టుదలతో రంగంలోకి దిగిన కొత్త నేతలు తమ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు. ఎన్నికల బరిలోకి తొలిసారి దిగుతుండగా అన్ని రకాలుగా ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. అందులో అధికార బీఆర్ఎస్ నుంచి నలుగురు కొత్త అభ్యర్థులు ఈ సారి ఎన్నికల బరిలో ఉండగా… కాంగ్రెస్ నుంచి 24 మంది, బీజేపీ నుంచి 18 మంది కొత్తవారు అవకాశం దక్కించుకున్నారు. ఇక, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మాజీ ఐపిఎస్ అధికారి, తెలంగాణ బిఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగారు.
ఈ మేరకు కొత్తగా పోటీ చేసిన అభ్యర్థులు.. తమ ప్రత్యర్థులు బలమైన వారు కావడంతో వారిని ఢీ కొట్టడానికి సర్వశక్తులు కూడగట్టుకున్నారు. ముఖ్యంగా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆయన పోటీ చేస్తున్న సిర్పూర్ నియోజకవర్గంలో తీవ్రంగా శ్రమించారు. ఎస్సీ నియోజకవర్గంలో అవకాశం ఉన్నప్పటికీ సరికొత్త మార్గాలను వేసే క్రమంలో జనరల్ సీటును ఎంచుకున్నారు. ప్రత్యర్థి, అధికార పార్టీ ఎమ్మెల్యే కోనప్ప బలమైన అభ్యర్థ కాగా.. ఆయన్ను ఢీ కొట్టడానికి ప్రజల్లో మమేకమయ్యారు. సిర్పూర్లోనే నివాసం ఉండటానికి అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇలా బీఎస్పీ తరపున కేడర్ను పెంచుకోవడంతో పాటు వారి ద్వారా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రవీణ్ కుమార్ తీవ్రంగా కృషి చేశారు.
ఇక, పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి తనను తాను నిరూపించుకోవడానికి నిత్యం ప్రజల్లో తిరిగి తీవ్రంగా శ్రమించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. తన తండ్రి చేసిన అభివృద్దిని గమనించి కేసీఆర్ టికెట్టు ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్కు తన గెలుపును గిఫ్ట్గా ఇస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కంటోన్మెంట్ నుంచే తొలిసారి బరిలోకి దిగారు. ఇక, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వడ్డి మోహన్రెడ్డి బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలిసారే తాజా, మాజీ ఎమ్మెల్యేలతో పోటీ పడ్డారు.
అధికార బీఆర్ఎస్ పార్టీలో తొలి అవకాశం వచ్చిన వాళ్లు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి లాస్య నందిత, ఖానాపూర్ నుండి భూక్యా జాన్సన్; కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్; ములుగు నియోజకవర్గం నుండి బడే నాగజ్యోతి మొదటిసారి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఛాన్స్ పొందిన వారిని చూస్తే.. సిర్పూర్ నియోజకవర్గంలో బిఎస్పీ నుండి ప్రవీణ్ కుమార్ బరిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా రావి శ్రీనివాస్ మొదటి సారి పోటీ చేశారు. అలాగే, అజ్మీరా శ్యామ్నాయక్ – (ఆసిఫాబాద్); కంది శ్రీనివాస్రెడ్డి – (ఆదిలాబాద్); వెడ్మ బొజ్జు పటేల్ – (ఖానాపూర్); ఎం.సునీల్కుమార్ – (బాల్కొండ); వొడితల ప్రణవ్ – (హుజూరాబాద్); మైనంపల్లి రోహిత్రావు – (మెదక్); బండి రమేశ్ – (కూకట్పల్లి); కస్తూరి నరేందర్ – (రాజేంద్రనగర్) ; మెగిలి సునీత – (గోషామహల్); చిట్టెం పర్ణికా రెడ్డి – (నారాయణపేట); అనిరుధ్రెడ్డి – (జడ్చర్ల); వాకిటి శ్రీహరి – (మక్తల్); జయవీర్రెడ్డి – (నాగార్జునసాగర్); వెన్నెల – (కంటోన్మెంట్); మామిడాల యశస్విని – (పాలకుర్తి); మురళీ నాయక్ – (మహబూబాబాద్); నాయిని రాజేందర్రెడ్డి – (వరంగల్ పశ్చిమ) ; కేఆర్ నాగరాజు – (వర్ధన్నపేట); పరమేశ్వర్రెడ్డి – (ఉప్పల్); పి.శ్రీనివాస్ – (కరీంనగర్); మేఘారెడ్డి – (వనపర్తి); డా.మట్టా రాగమయి – (సత్తుపల్లి); వైరా నియోజకవర్గం నుండి మాలోత్ రాందాస్ మొదటి సారి పోటీ చేశారు.
బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో…. మంత్రి కేటీఆర్పై పోటీ చేస్తున్న సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమదేవి; బోధన్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వి.మోహన్రెడ్డి, ఆర్మూర్ నుండి పి.రాకేశ్రెడ్డి; దినేశ్ -(నిజామాబాద్ గ్రామీణం); భోగ శ్రావణి – (జగిత్యాల); కందుల సంధ్యారాణి – (రామగుండం); సంగప్ప – (నారాయణఖేడ్); పూసరాజు – (ముషీరాబాద్); మిథున్కుమార్ రెడ్డి – (మహబూబ్నగర్); దశమంతరెడ్డి – (జనగామ); కుంజ ధర్మారావు – (భద్రాచలం); రామలింగేశ్వరరావు – (సత్తుపల్లి); బాలరాజు – (పినపాక); రవికుమార్ – (పాలేరు); సతీష్ అనుజ్ఞారెడ్డి – (వనపర్తి); రామచంద్ర రాజనర్సింహా – (జహీరాబాద్); పడాల శ్రీనివాస్ – (ఆలేరు); పరకాల నుండి డా.కె.ప్రసాదరావు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.