Election Commission : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య సంప్రదింపులు జరిగాయి.
డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది . ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని ఈసీ అడిగింది. గతంలో డీఏల చెల్లింపు విధివిధానాలపై ఈసీ ఆరా తీసింది. ఉద్యోగ సంఘాలు కూడా డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి తమ వినతిని పంపాయి. తాజాగా తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది.