Nagarjuna Sagar Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై తలెత్తిన సమస్యను పరిష్కరించడంపై కేంద్రం దృష్టి పెట్దింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. త్వరలోనే మీటింగ్ మినిట్స్ విడుదల చేస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ వోహ్రా తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
కృష్ణా జలాల విషయంలో ఉద్రిక్తతల తగ్గింపు, నాగార్జునసాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం నిర్వహణ బదిలీ అంశంపై చర్చించింది. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలపై కూడా దృష్టి పెట్టింది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు.. వాటి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు అప్పగించే ప్రక్రియను కేంద్రజలశక్తి శాఖ ప్రారంభించనుంది. కేఆర్ఎంబీ పర్యవేక్షణలో ఉన్న ప్రాజెక్టులను సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత పరిధిలోకి రెండు జలాశయాలను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. జలాశయాల నిర్వహణ మొత్తాన్ని కేఆర్ఎంబీకే అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.