Telangana Congress : తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రభుత్వ ఆక్రమ చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ లావాదేవీలపై నిఘాపెట్టాలని డిమాండ్ చేస్తోంది. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని నిధులు మళ్లించే ఛాన్స్ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. దీనిపై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టాలని కోరింది. ఈ మేరకు అధికారులను కలిసి కేసీఆర్పై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ బృందం .
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ బృందం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిసింది. రైతు బంధు నిధులను కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మళ్లించే అవకాశముందని అనుమానం చేసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న అసైన్డ్ ల్యాండ్లను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందన్న సందేహాలు వ్యక్తం చేశారు. వికాస్రాజ్ను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. 4 అంశాలపై వినతిపత్రం ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు నిధులు మళ్లిస్తోందని ఉత్తమ్ తెలిపారు. అసైన్డ్ భూముల రికార్డులు మార్చుతున్నారని చెప్పామన్నారు. భూ రికార్డులు మారుస్తున్న సమాచారం తమకి ఉందన్నారు. ఢిల్లీలో సీఈవో దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూ రికార్డులు మారుస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులపై జోక్యం తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ ను కోరామన్నారు.