Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెజవాడ దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం చేశారు. ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.
దుర్గమ్మ శక్తి స్వరూపిణి అని చంద్రబాబు అన్నారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని కోరుకున్నానని తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమన్నారు. అందుకే దైవదర్శనాలు చేస్తున్నానని వివరించారు.
సాయంత్రం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. సింహాచలం వెళ్లి అప్పన్నను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. చంద్రబాబు మరికొన్ని ప్రముఖ క్షేత్రాలకు వెళ్లనున్నారు. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. ఆ తర్వాత కడప దర్గా, గుణదల మేరీమాత చర్చిలకు వెళ్లనున్నారు.
శుక్రవారం చంద్రబాబు తిరుమల వెళ్లారు. శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడ వచ్చే వరకు ఆయనకు అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు ,నేతలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఆయన తీర్థయాత్రలు పూర్తైన తర్వాత.. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
.
.