YS Sharmila : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై మొదటి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నానని చెప్పుకొచ్చారు . కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని షర్మిల సైటర్ వేశారు. బైబై కేసీఆర్ అనే స్లోగన్ తో ఉన్న పోస్టర్ ప్రదర్శించారు.
తెలంగాణ సీఎం నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు. పోడు భూముల పేరుతో గిరిజనులను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే పోరాటం చేశానని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ నుంచి తప్పుకున్న సమయంలో తన పార్టీ వాళ్లే అర్థంచేసుకోలేకపోయినా.. ఎన్ని మాటలు అన్నా పడ్డానని వివరించారు. కానీ కేసీఆర్ ను ఓడించాలనే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చానన్నారు. అందుకే త్యాగం చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేశానని షర్మిల అన్నారు.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకయ్యాయని షర్మిల విమర్శించారు. వాచ్ డాగ్ లా ఉండాల్సిన బీజేపీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై బీజేపీ యాక్షన్ తీసుకోలేదని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు తోడు దొంగలేనని అన్నారు. కేసీఆర్ స్కీములన్నీ స్కామలని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటిఎంలా కేసీఆర్ వాడుకున్నారని బీజేపీ నేతలు విమర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేతలను షర్మిల ప్రశ్నించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించవద్దన్నారు. ప్రజాతీర్పును గౌరవించాలని స్పష్టం చేశారు. 2014,2018 ఎన్నికల్లో కలిపి మొత్తం 45 మంది ప్రజాప్రతినిధులను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అందులో 40 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉన్నారని వివరించారు. ఇప్పుడు మాత్రం బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయకూడదని స్పష్టంచేశారు. ప్రభుత్వం మారాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. తెలంగాణ ప్రజల్లో జీవితాల్లో మార్పురావాలని ఆక్షాంక్షించారు.
.
.