Enforcement Directorate: లంచాలు తీసుకుని, అక్రమంగా డబ్బు సంపాదించిన వారిపై దాడులు చేసే ఈడీ అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. ఒక ప్రభుత్వ అధికారి నుంచి లంచం తీసుకుంటూ ఒక ఈడీ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్ లో జరిగింది. నిందితుడిని అంకిత్ తివారీగా గుర్తించారు. అక్టోబరు 29న దిండిగల్ జిల్లా విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగ ఉద్యోగికి అంకిత్ ఫోన్ చేశాడు. ఆయనపై గతంలో నమోదై, ముగిసిన కేసును దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయని, అక్టోబర్ 30న మధురైలోని ఈడీ కార్యాలయం విచారణకు రావాలని కోరాడు.
అదంతా నిజమేనని నమ్మిన ఉద్యోగి అక్టోబర్ 30న ఈడీ కార్యాలయానికి వెళ్లాడు. రూ.3 కోట్లు ఇస్తే కేసు క్లోజ్ చేస్తానని తివారీ అతనితో బేరం పెట్టాడు. రూ.51 లక్షలు ఇస్తే సరిపోతుందని.. ఉన్నతాధికారులు కూడా అందుకు ఒప్పుకున్నారని నమ్మబలికాడు. అందుకు అంగీకరించిన ఆ ప్రభుత్వ ఉద్యోగి నవంబర్ 1న తొలి ఇన్ స్టాల్ మెంట్ కింద రూ.20 లక్షలు అందించాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని, వాటిని పై అధికారులకు అందజేయాల్సి ఉందని, లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
దాంతో అంకిత్ పై అనుమానం వచ్చిన అతను.. నవంబర్ 30న డీవీసీఏకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 1న ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటుండగా రాష్ట్ర విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మధురైలోని ఈడీ కార్యాలయంతో పాటు అంకిత్ తివారీ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించగా.. ఎంతోమందిని ఇలాగే బెదిరించి కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం కోర్టు అంకిత్ కు ఈనెల 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది.