Anti-incumbency : ఇందులేదు.. అందులేదు.. ఎందెందు వెతికినా.. అందందే.. అన్నట్లుగా బీఆర్ఎస్పై వ్యతిరేకత క్లియర్గా కనిపించింది. కారు కంచు కోటలు బద్ధలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఉత్తర తెలంగాణతో పాటు అటు దక్షిణ తెలంగాణలోనూ హస్తం హవా కొనసాగేలా ఉంది. పోలింగ్ రోజు ఎమ్మెల్యేలపై బయటపడ్డ వ్యతిరేకతనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీయడం గులాబీ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఇన్నాళ్లూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై బీఆర్ఎస్ అగ్రనేతలు ఆశలు పెట్టుకున్నా అక్కడ కూడా కారు టైర్లు పంక్షయర్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రచార పర్వంలోనే వ్యతిరేకత కనిపించినా గుంభనంగా వ్యవహరించారు. తీరా పోలింగ్ కేంద్రాల వద్ద నిలదీతలు మిగతా ఓటర్లపైనా ప్రభావం చూపాయని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీపై వ్యతిరేకత పెల్లుబుకింది. పోలింగ్ రోజున కేంద్రాల పరిశీలనకు వచ్చిన నేతలకు నిరసనసెగ తగిలింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ నేతలను ఓటర్లు పరుగులు పెట్టించారు. ప్రచార పర్వంలోనే అడ్డుపడగా.. పోలింగ్ సెంటర్ల దగ్గర కూడా అదే సీన్ రిపీట్ అవగా నేతలు కంగుతిన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అడుగడుగునా మంత్రి ఎర్రబెల్లికి నిరసనలు ఎదురయ్యాయి. పోలింగ్ బూత్ల పరిశీలనకు వెళ్లినన మంత్రిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు నిరసన సెగ తగిలింది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లగా అడ్డుకున్న ఓటర్లు… గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ కలర్ కండువాతో పోలింగ్ బూత్లో తిరగడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పల్లా గో బ్యాక్ అనే నినాదాలు మిన్నంటాయి. వరంగల్ తూర్పు సెగ్మెంట్ పెరికవాడ పోలింగ్ బూత్లోకి బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ వెళ్లడంతో వివాదం తలెత్తింది. ఓటర్లు క్యూ లైన్లో ఉండగానే నరేందర్ బూత్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఓటర్లు అడ్డుపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి పోలింగ్ సెంటర్ పరిశీలనకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు BRS అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డికి…..నిరసన ఎదురైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. తన అనుచరులతో పోలింగ్ కేంద్రంలో ప్రవేశించడంతో గొడవ జరిగింది. హుజూర్నగర్లోని పోలింగ్ కేంద్రంలో BRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి….ఓవరాక్షన్ చేశారు. పార్టీ కండువా తీసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లండన్న పోలీసులతో గొడవకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఆలేరు బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త గొంగిడి మహేందర్ రెడ్డి గ్రామంలోని హైస్కూల్లో గల పోలింగ్ బూతులోకి తన కారుతోని లోపలికి వెళ్లడంతో ఆగ్రహించి ఒక్కసారిగా మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి జరిపారు.
మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో BRS అభ్యర్థి శంకర్ నాయక్కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో కంబాలపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లగా.. ఓటర్లు నిలదీశారు. రెండు సార్లు ఓటేసి గెలిపిస్తే ఏం చేశావని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక మౌనంగా దండం పెట్టుకుంటూ శంకర్నాయక్ అక్కడ నుంచి జారుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి వైఖరి ఉద్రిక్తతలకు దారితీసేలా చేసింది. తనతో పాటు మరికొందరి పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుచెప్పారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ప్రలోభాలపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకునూర్ గ్రామంలో ఓటర్ స్లిప్పుల కోసం మభ్యపెడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కంసన్పల్లిలో….గువ్వల బాలరాజుకు నిరసన సెగ తప్పలేదు.
ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఇన్నాళ్లూ తమకు ఎదురు లేదని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే గురువారం పోలింగ్ కేంద్రాల వద్ద ఎదురైన పరాభవం పునరాలోచనలో పడేసింది. హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్.. ఇలా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇదే పరిస్థితులు ఫలితాల్లోనూ కనిపించే అవకాశం ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
.
.