టీమిండియా ఆసిస్ తో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ గెలవడమే కాదు.. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న టీమిండియా 3-1 తేడాతో సిరీస్ పట్టేసింది. ఈ క్రమంలో పాక్ పేరు మీదున్న ప్రపంచ రికార్డ్ ను బద్దలు కొట్టింది.
ఈ మ్యాచ్ విజయంతో టీ20 క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకూ 213 మ్యాచ్లు ఆడిన భారత్.. 136 మ్యాచ్లలో విజయం సాధించింది. పాకిస్తాన్ 226 మ్యాచ్ లు ఆడి 135 మ్యాచ్ లలో గెలుపొందింది. పాక్ కన్నా 13 మ్యాచ్ ల ముందే అత్యధిక మ్యాచ్ లు గెలుపొందిన జట్టుగా భారత్ నిలిచింది.
భారత్, పాకిస్తాన్ తర్వాత వరుసలో న్యూజిలాండ్ (103), ఆస్ట్రేలియా (95), సౌతాఫ్రికా (95) విజయాలతో ఉన్నాయి.
అంతేకాదు సొంతగడ్డపై వరుసగా 14వ సిరీస్ను కూడా భారత్ తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా సొంతగడ్డపై ఆఖరిసారిగా 2019లో సిరీస్ కోల్పోయింది.
సిరీస్ తో పాటు పలు రికార్డులు కూడా భారత్ వశం కావడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 174 పరుగుల ఒక మోస్తరు స్కోరుతో ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుని ఓడించి సిరీస్ కైవసం చేసుకోవడం గొప్ప విషయమని అంటున్నారు.
సూర్య కెప్టెన్సీ కూడా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఫీల్డింగ్ సెటప్ గానీ, పరిస్థితులను బట్టి బౌలింగ్ మార్చడం గానీ అంతా పెర్ ఫెక్ట్ గా కుదిరాయని అంటున్నారు.
మూడో టీ 20 మ్యాచ్ లో 222 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే సూర్య కెప్టెన్సీ కూడా వివాదాస్పదమైంది. 19వ ఓవర్ అక్షర్ పటేల్ కి ఇచ్చినందుకు ఇలా జరిగిందని విమర్శలు వచ్చాయి.
ఈ ఓటమి నేపథ్యంలో ప్రధాన బౌలర్ ప్రసిద్ధ్, అర్షదీప్ సింగ్ ఇద్దరినీ నాలుగో టీ 20కి తప్పించారు. కొత్తగా వారి ప్లేస్ లో దీపక్ చాహర్, ముఖేష్ కుమార్ వచ్చారు. అయితే వీరిద్దరూ పూర్వమ్యాచ్ అనుభవాన్ని ద్రష్టిలో పెట్టుకుని పొదుపుగా బౌలింగ్ చేయడంతో 174 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా కాపాడుకుందనే చెప్పాలి.