కారు టైర్ పంక్చర్ కాబోతుందా..? గులాబీ కోటకు బీటలు మొదలయ్యాయా..? ప్రజా తీర్పు అలా ఈవీఎంలలో నిక్షిప్తమైందో లేదో.. గులాబీ కేడర్కు లైట్గా షివరింగ్ స్టార్ట్ అయ్యింది. వారి పరేషాన్ను మరింత పెంచేలా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. సంస్థలు వేర్వేరైనా.. అన్నీ ముక్తం కంఠంతో చెప్పింది ఒక్కటే.. కారు జోరుకు బ్రేక్ పడనుంది.. హస్తం పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయనుంది. అయితే ఊరంతా ఒకదారి.. ఉలికిపిట్టది మరోదారి అన్నట్లుగా కేటీఆర్ మాత్రం గెలవబోయేది తామే అంటున్నారు. ఫలితాల కోసం తెలంగాణ మొత్తం నిద్రపట్టకుండా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. తాను మాత్రం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానంటూ ట్వీట్ చేశారు. ఇక కేసీఆర్ అయితే ఓ అడుగు ముందుకు వేశారు. డిసెంబర్4న తన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుందని సీఎంఓతో ప్రకటన చేయించారు.
ఎగ్జిట్ పోల్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అసహనం ఇది. ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్ అని 2018లోనూ ఇలాగే బీఆర్ఎస్కు తక్కువ స్థానాలు వస్థాయని లెక్కతేల్చారని మండిపడ్డారు. ఫలితాలు వచ్చిన తర్వాత తప్పని తేలితే సర్వే సంస్థలు క్షమాపణ చెబుతాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామేనని ధీమాగా చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు కంగారు పడొవద్దని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చేది గులాబీనేనని.. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ను గతంలోనూ చూశామని ఎద్దేవా చేశారు. 70కిపైగా స్థానాలు దక్కించుకుంటామని.. హ్యాట్రిక్ కొట్టి.. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ మరోసారి కాన్ఫిడెన్స్ కనబరిచారు. దాదాపు 50 రోజుల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. పోలింగ్ పూర్తైన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానంటూ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ కాస్త పెరగొచ్చని.. కానీ, ఎగ్జాక్ట్ పోల్స్ తమకు శుభవార్తన్ని ఇస్తాయని అన్నారు. 2018లో ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలు ఇచ్చాయని విమర్శించారు. అయితే కేటీఆర్ది కాన్ఫిడెన్సా.. లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా అని పొలిటికల్గా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సునామీ కనిపిస్తున్నా కేటీఆర్ ఓటమిని అంగీకరించేలానో.. లేదంటే వెయిట్ అండ్ సీ అన్నట్లుగా రిజల్ట్ వచ్చే వరకు వేచి చూద్దాం అనే తరహాలోనూ మాట్లాడకపోవడం చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ ఎన్నికల వ్యూహాలన్నీ సర్వేలపై ఆధారాపడే చేస్తుంటారు. టికెట్ల కేటాయింపు నుంచి రకరకాల సర్వేలు చేయించి టికెట్లు కన్ఫాం చేస్తారు. ఈసారి కూడా ఆ సర్వేలనే సాకుగా చూపి కొందరికి టికెట్లివ్వకుండా మొండిచెయ్యి చూపారు. ఇప్పుడు అదే విశ్వసనీయత ఉన్న సంస్థలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవంటే మాత్రం కేటీఆర్ తట్టుకోలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
హోరాహోరీగా జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ప్రజలు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఆయా సంస్థలు తమతమ అంచనాలను వెలువరించాయి. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికలు కావడంతో వాస్తవ ఫలితాల కోసం అన్ని వర్గాలూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలను దాదాపుగా కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేస్తుందని తేల్చాయి. బీఆర్ఎస్ పరువు కాపాడేది ఉత్తర తెలంగాణే అని చెప్పాయి. హంగ్ వచ్చే పరిస్థితి కూడా లేదని మెజార్టీ సర్వే సంస్థలు తేల్చాయి. ఇక తెలంగాణలో వికసించి వెలిగిపోతామనుకున్న కమలం.. మరోసారి వాడిపోవడం తప్పదన్నాయి ఎగ్జిట్పోల్స్. బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని కొన్ని సంస్థలు చెప్పగా.. కొన్ని సర్వే సంస్థలు మాత్రం 12 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అన్నాయి. ఎంఐఎంకు ఎప్పటిలాగే నాలుగు నుంచి ఆరు స్థానాలను కట్టబెట్టాయి. ఎగ్జిట్పోల్స్ ఎంత వరకు నిజమవుతాయి.. ఎంత వరకు అంచనాలు లెక్కతప్పుతాయనేది డిసెంబర్3న తేలిపోనుంది. అయితే అంతకుముందే కేటీఆర్ మాత్రం తాము గెలిచిపోయాం అని చెప్పడం లోలోపల భయం ఉన్నా పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ నేతల్లో ఇంటర్నల్ గా ఓటమిపై చర్చ నడుస్తోంది. ఈ సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందని అంచనాలు వెలువరించడంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ వేవ్ను ఆపడం బీఆర్ఎస్ తరం కాలేదన్న విషయం బహిర్గతమైంది. అయితే కేసీఆర్ కూడా ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 4న మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. గెలుపుపై సీఎం కేసీఆర్ కూడా ధీమాగా ఉన్నారనే సంకేతాలు పంపిస్తున్నారు. అయితే ఫలితాల తర్వాత పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయనేది తేలాల్సి ఉంది.
.
.