Telangana election : తెలంగాణలో యువ చైతన్యంతో ఓటింగ్ పర్సంటేజ్ 70శాతం దాటిందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత ఎంతో కష్టపడి తాము పుట్టి పెరిగిన పల్లెటూళ్లకి వెళ్లి ఓటు వేసి మరీ వచ్చారు.
కొందరు సాఫ్ట్ వేర్ యువత అయితే అప్పటికప్పుడు టిక్కెట్లు దొరక్కపోతే ఫ్లయిట్ లో కూడా వచ్చి ఓటు వేసి వెళ్లడం విశేషం. ఎందుకంటే పోలింగ్ రోజున హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం కిటకిటలాడటమే అందుకు నిదర్శనం.
ఇది దేనికి సంకేతం అంటే.. రాబోవు రోజుల్లో రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెబుతున్నారు. కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల నాటికి యువభారత్ చేతికి ఓటు వెళుతుంది. ఇంక ముసలి ముతక పాత తరం, పాత భావాలు, పాత సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చెల్లా చెదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే తెలంగాణకు వస్తే నిరుద్యోగులు, విద్యార్థులు, యువత ఎక్కువగా ఓటింగులో పాల్గొన్నట్టు సమాచారం. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదున్న వ్యతిరేకత కారణంగానే అందరూ పట్టుపట్టి తమ ఊళ్లకి వెళ్లి మరీ ఓట్లు వేసి వచ్చారని అంటున్నారు. వారు వేయడమే కాదు, ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరందరినీ ఇన్ ఫ్లుయెన్స్ చేశారని అంటున్నారు.
ఇక చిన్నాచితక ఉద్యోగాలు చేసుకునే లక్షలాది మంది పిల్లాపాపలతో కలిసి జంటనగరాల నుంచి సొంత ఊళ్లకు కదిలారు. బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. దొరక్కపోతే కొందరు కార్లను అద్దెకు తీసుకుని కదిలి వెళ్లారు. కొందరు యువత బైక్ ల మీద కూడా రయ్ రయ్ మని వెళ్లారు. యువత మాత్రం పోలింగ్ రోజుని ఒక సెలబ్రేషన్ లా చేసుకోవడం విశేషం.
పోలింగ్ రోజున సెలవు ప్రకటించడం, నగరవాసులు పలువురు ఖాళీ చేయడంతో హైదరాబాద్ నగరం బోసిపోయినట్టు కనిపించింది. నిత్యం రద్దీ, ట్రాఫిక్ జామ్ లతో మూడు పువ్వులు – ఆరు కాయలుగా ఉండే నగరం ఒక్కసారి నిశ్శబ్ధంగా మారిపోయింది. అంతా కొత్త కొత్తగా కనిపించింది.
దురదృష్టం ఏమిటంటే హైదరాబాద్ నుంచి సగం మంది ఇళ్ల నుంచి కదల్లేదు. కేవలం 46 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది హైదరాబాద్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన గొప్పవాళ్లు చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ యువత మాత్రం బాధ్యతగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం చెప్పుకోతగిన పరిణామంగా చెబుతున్నారు. మారుతున్న కాలానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి యువత దిక్సూచిలా మారనుంది అనడానికి తెలంగాణ ఎన్నికలే ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు.