ఆయన ఓటమి ఎరుగని రాజకీయ నాయకుణ్ణి అని చెప్పుకుంటారు. పాలకుర్తిలో పాలబుగ్గల మొనగాడిని అని బిల్డప్ ఇస్తారు. కేసీఆర్ది నాదీ ఒకే సామాజిక వర్గం అని గొప్పలు పోతారు. నన్ను ఎదిరించేవాడే లేరనేలా విరుచుకుపడతారు. నియోకవర్గంలో తాను ఎంతంటే అంతని.. చెప్పిందే వేదమనేది ఎర్రబెల్లి ఫీలింగ్.. కానీ, చాలా రోజులకు చుక్కలు చూపించే నాయకురాలు ఒకరు వచ్చారు. 26 ఏళ్ల యంగ్ డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్గా అవతరించారు. హా వీళ్లేం చేస్తారులే అనుకునే మంత్రి ఓవర్ కాన్ఫిడెన్స్ను మట్టి కరిపించి.. నియోజకవర్గం అంతా పరిగెత్తించేలా చేశారు. మరి ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి చెప్పినట్లు ఎర్రబెల్లి స్వగ్రామం పర్వతగిరికి పారిపోతారా అనే చర్చ జరుగుతోంది.
పోలింగ్ రోజు మంత్రి ఎర్రబెల్లి కుటుంబ సభ్యులకు ఎక్కడికక్కడ అడ్డగింతలు ఎదురయ్యాయి. ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్లినా నిరసనలే వ్యక్తమయ్యాయి. ఎర్రబెల్లితో పాటు ఆయన సతీమణికి పాలకుర్తి ఓటర్లు చుక్కలు చూపించారు. ప్రలోభపెట్టడానికే పోలింగ్ బూతుల వద్దకు వచ్చారని అడ్డుకున్నారు. తొర్రూరు మండలం అరిపిరాల పోలింగ్ బూత్ వద్దకు ఎర్రబెల్లి వెళ్లగా.. ఆయనకు వ్యతిరేకంగా ఓటర్లు నినాదాలు చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. చేసేందేం లేక ఎర్రబెల్లి అక్కన్నుంచి జారుకున్నారు. పెద్దవంగర మండలంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గండ్లకుంట పోలింగ్బూత్ వద్దకు వెళ్లగా అక్కడ కూడా చేదు అనుభవం తప్పలేదు. ఇక్కడికెందుకు వచ్చారని ఓటర్లు నిలదీశారు. ఆ పోలింగ్ బూత్ నుంచి కూడా మంత్రి ఎర్రబెల్లి వెనుదిరిగారు.
మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్రావుకు కూడా అడుగడుగునా నిరసనలు వ్యక్తం అయ్యాయి. రామరాజుపల్లి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా అక్కడి ఓటర్లు అడ్డుకున్నారు. ప్రలోభపెట్టడానికే వచ్చారని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేసేదిలేక ఆమె రామరాజుపల్లి పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయారు. మల్లంపల్లిలోనూ ఉషాదయాకర్రావుకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడా ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఓటర్లను మభ్యపెట్టేందుకు వచ్చారని మండిపడ్డారు. ఇలాంటి నీచరాజకీయాలు చేస్తున్న ఎర్రబెల్లి ఫ్యామిలీకి తగిన గుణపాఠం చెబుతామని పాలకుర్తి ప్రజలు నినదించారు. ప్రచారంలోనూ ఎర్రబెల్లికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా దాన్ని కవర్ చేస్తూ వచ్చారు. 70 వేల మెజారిటీతో గెలుస్తానని ప్రచారం చేసుకున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటనేది ఫలితాలకు ముందే ఏకంగా పోలింగ్ రోజే తేలిపోయింది.
ఇన్నాళ్లూ పాలకుర్తిలో తనకు ఎదురులేదని మంత్రి ఎర్రబెల్లి విర్రవీగారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఝాన్సీరెడ్డి ఎంట్రీతో ఖంగుతిన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి పౌరసత్వం విషయంలో అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇక బలైన ప్రత్యర్థులు లేరు అనుకున్న తరుణంలో యశస్వినిరెడ్డి ఎంట్రీతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఎన్నికలు పూర్తవగానే యశస్వినిరెడ్డి అమెరికా వెళ్లిపోతారని ఎర్రబెల్లి దుష్ప్రచారానికి దిగారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలను యశస్వినిరెడ్డి దీటుగా తిప్పికొట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చినా ఆమెను పాలకుర్తి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. బలమైన ప్రత్యర్థి రావడంతో ఎర్రబెల్లిని ప్రచారంలోనే అడుగడుగునా అడ్డుకున్నారు. గ్రామాలకు ఏం చేశావని నిలదీశారు. యశస్వినిరెడ్డికి ప్రజా మద్దతు పెరుగుతుండగా మంత్రి.. అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఝాన్సీ రాజేందర్రెడ్డి దంపతులు నాన్లోకల్ అని హౌజ్ అరెస్ట్ చేయించారు. యశస్వినిరెడ్డిని ఒంటరి చేసేందుకు ప్రయత్నించారు.
పోలింగ్ రోజు యశస్వినిరెడ్డి ధైర్యం కోల్పోలేదు. ఒంటరిగానే పోలింగ్ సెంటర్లను పరిశీలించారు. క్యూ లైన్లలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేయడానికి మంత్రి యత్నించగా ఎక్కడికక్కడ నిలదీసిన కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాయి. పోలింగ్ రోజున మంత్రి ప్రచార పర్వం కొనసాగించగా.. ధైర్యంగా ప్రశ్నించి ఓటర్లు అడ్డుకున్నారు. ఈ పరిస్థితులన్నీ చూసిన ఎర్రబెల్లి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనలో పడిపోయారు. తన ఓటమి ఖాయమైందని సన్నిహితుల వద్ద తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్తో మంత్రిలో మరింత ఫియర్ పెరిగిపోయింది. ఎర్రబెల్లిని సొంత గ్రామం పర్వతగిరికి తరిమికొట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్టాపిక్ అయ్యాయి. పాలకుర్తిలో ఇక ఎర్రబెల్లి ఆగడాలకు బ్రేక్ పడినట్లేనని.. రాజకీయాల్లోనూ ఆయన శకం ముగిసినట్లేననే చర్చ జరుగుతోంది.
.
.