పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. సాధారణంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్లమెంట్ సమావేశాలకు ఒకరోజు ముందు నిర్వహిస్తుంటారు. ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకరోజు తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.
IPC, CRPC, ఎవిడెన్స్ యాక్ట్ల సవరణలకు ఉద్దేశించిన మూడు ముఖ్యమైన బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి. వీటన్నిటి కంటే.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్ర వ్యవహరం శీతాకాల సమావేశాల్లో వేడి రాజేయనుంది. క్యాష్ ఫర్ క్వెరీ ఆరోపణలపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ సభాపతికి నివేదిక సమర్పించింది. మహువా మొయిత్రాని పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. ఆ రిపోర్టుపై సభలో చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన పలు కీలక బిల్లులలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లులను అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తం 24 బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 7 కొత్త బిల్లులను శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశముంది.