Mizoram Election Results: డిసెంబర్ 3. ఈ రోజు బిగ్ డే. ఒకటికాదు.. రెండు కాదు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇది నిన్నటి వరకూ ఉన్న న్యూస్. కానీ.. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు కారణమేంటో కూడా వివరించింది. మిజోరాంలో క్రైస్తవులు ఎక్కువగా ఉండటంతో.. ఎక్కువశాతం మంది చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ఆదివారం ప్రార్థనలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఓట్ల కౌంటింగ్ తేదీని మార్చాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో.. మిజోరాం ఎన్జీఓ సమన్వయ కమిటీ సభ్యులతో పాటు పలు సంఘాల నుంచి విజ్ఞప్తులు రాగా.. వాటన్నింటినీ ఈసీ పరిగణలోకి తీసుకుంది. కౌంటింగ్ తేదీని సవరించి.. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
మిజోరాం శాసనసభకు నవంబర్ 7న పోలింగ్ జరుగగా.. 8.57 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడగా.. వారి భవితవ్యం డిసెంబర్ 4న తేలనుంది. ఇక గురువారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి.. మిజోరాంలో హంగ్ గవర్నమెంట్ ఏర్పడవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ అంచనా వేసింది. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. MNF -14-18 సీట్లు, జోరం పీపుల్స్ మూవ్ మెంట్ కు 12-16 సీట్లు, కాంగ్రెస్ కు 8-10 సీట్లు, బీజేపీకి 0-2 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో యథాతథంగా ఓట్ల లెక్కింపు జరగనుంది.