తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయితీపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించనుంది. ఇటీవల తెలంగాణ పోలింగ్కు కొన్ని గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాంపై జరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో జలశక్తిశాఖలో జలవనరుల విభాగం కార్యదర్శి నేతృత్వంలో వర్చువల్గా భేటీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు ఈ భేటీలో రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, కేఆర్ఎంబీ చైర్మన్లు హాజరుకానున్నారు. కృష్ణా జలాల వివాదంతో నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలపై చర్చ జరగనుంది.
తెలంగాణలో పోలింగ్కు ముందు రోజు అర్థరాత్రి దాదాపు 5 వందల మంది ఏపీ పోలీసులు నాగార్జున డ్యాంపైకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బందోబస్తు మధ్య నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం..13 గేట్లకు కంచె వేయడం సంచలనం రేపింది. పోలింగ్ సందర్భంగా ఈ వివాదం తెలంగాణలో పొలిటికల్ చర్చకు దారి తీసింది. కావాలనే సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిలిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇదిలా ఉంటే జల పంచాయితీ ఢిల్లీకి చేరింది. నీటి విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఏపీ అధికారులను ఆదేశించిన కేంద్రం.. CRPF బలగాలను దించి సాగర్ డ్యామ్ను ఆధీనంలోకి తీసుకుంది.
మరోవైపు కృష్ణా జలాల పంచాయితీ సుప్రీం వరకు వెళ్లిన నేపథ్యంలో కేసు విచారణ జనవరి 12కి వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యూనల్కు నూతన విధివిధానాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సర్కార్. పిటీషన్ను విచారించిన సుప్రీం కౌంటర్ దాఖలు చేయాలని అటు కేంద్రానికి, ఇటు తెలంగాణకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలకు కేంద్ర జలశక్తి శాఖ సమయం కోరడంతో తదుపరి విచారణను 12కు వాయిదా వేసింది. ప్రస్తుతం సాగర్ డ్యామ్ సీఆరీపీఎఫ్ పర్యవేక్షణలో ఉండటంతో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో జరిగే కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.