తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో.. రేపే ఫలితాలు విడుదలకానున్నాయి. దీంతో ఓటర్లు నిక్షిప్తం చేసిన రిజల్ట్స్పై నేతల్లో గుబులు పట్టుకుంది. ఎవరి భవితవ్యం ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తంకు పట్టం కట్టడంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఉత్సాహంలో ఉన్నారు. హస్తం హవా జోరుమీదుండటంతో రేవంత్రెడ్డి సీఎం ఖాయమన్న ధీమాలోనూ ఉన్నారు. మరోపక్క ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో గులాబీ, బీజేపీ శ్రేణులు మాత్రం టెన్షన్లో పడ్డారు. ఆ లెక్కల్ని పైకి కొట్టిపారేస్తున్నా లోలోపల మాత్రం గుబులుగా ఉన్నారు.
ఇక తాజాగా ఇండియా టుడే ప్రకటించిన ఫలితాల్లోనూ కాంగ్రెస్దే అధికారమని.. మెజార్టీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని వెల్లడించింది. కాంగ్రెస్ 63 నుంచి 73 సీట్లు వస్తాయని.. బీఆర్ఎస్ 34 నుంచి 44 సీట్లు వచ్చే అవకాశముందని.. బీజేపీకి 4 నుంచి 8 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది.. ఇతరులు 5 నుంచి 8 సీట్టు దక్కించుకోవచ్చని అంచనా వేసింది. ఇదిలా ఉంటే మరికొన్ని సంస్థలు హంగ్ ఏర్పడే అవకాశముందని వెల్లడించడంతో బీఆర్ఎస్ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉంది. మరి హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ కలల్ని తెలంగాణ ప్రజలు నీరుగారుస్తారా..? అంతా ఊహిస్తున్నట్టు హస్త వాసితో రేవంత్ సీఎం అవుతారా అన్నది తెలియాలంటే మరొక్క రోజు వేచి చూడాల్సిందే.
రేపు ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో మునిగారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలలో కౌంటింగ్ జరగనుంది. ముందుగా ఉ.8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో సెంటర్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ కూడా అమలులో ఉండనుంది.