తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని స్పష్టం చేశాయి. మరోవైపు గులాబీ నేతలు మాత్రం తామే గెలుస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కేటీఆర్ మరో అడుగు ముందుకేసి హ్యాట్రిక్ కొడతాం. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. 70 సీట్లు సాధిస్తామని బీరాలు పలుకుతున్నారు. ఇప్పడు గులాబీ బాస్ ఏకంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దని, మళ్లీ బీఆర్ఎస్ దే విజయమని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారని సమాచారం. హైదరాబాద్ ప్రగతిభవన్లో కేసీఆర్ను కొంతమంది నేతలు కలిశారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని ఆ నేతలకు కేసీఆర్ సూచించారు. రెండురోజులు ఓపిక పడితే 3న తేదీ సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో చెప్పారని తెలుస్తోంది.
మరోవైపు డిసెంబర్ 4న మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ భేటీ నిర్వహించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నెగటివ్గా వచ్చినా కానీ సీఎం కేసీఆర్ మాత్రం అధికారం మీద ధీమాగా ఉన్నారు. మూడో తేదీన సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరగనుంది.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నెగిటివ్ గా రావడంతో బీఆర్ఎస్ క్యాడర్ డీలా పడింది. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకే కేబినెట్ భేటీ ప్రకటన చేశారనే చర్చ నడుస్తోంది. మూడో తేదిన ఫలితాలు వస్తుంటే 4న కేబినేట్ మీటింగ్ ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ మాదిరిగానే వస్తే పరిస్థితి ఏంటి? అని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.