T20 World Cup 2024 : వన్డే ప్రపంచకప్ 2023 అయిపోయింది. ఇక అందరి దృష్టి టీ 20 ప్రపంచకప్ పై పడింది. యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచకప్ లో చిట్టచివరి స్థానం ఎవరిదో తేలిపోయింది. మొత్తం 20 జట్లు పొట్టి ప్రపంచకప్ లో పాల్గొంటున్నాయి. అయితే 20వ జట్టుగా జింబాబ్వే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి ఆఫ్రికాకి చెందిన ఉగాండా వచ్చింది.
క్వాలిఫైయింగ్ మ్యాచుల్లో జింబాబ్వే వరుసగా నమీబియా, ఉగాండా చేతిలో ఓటమిపాలైంది. ఈ రెండు ఓటములు జింబాబ్వే అవకాశాలను బాగా దెబ్బతీశాయి. కెన్యాతో ఆడిన మ్యాచ్ లో విజయం సాధించినా, ఆ గెలుపు సరిపోలేదు. చివరికి ఉగాండా తాజాగా రువాండాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి, జింబాబ్వే తలుపులు మూసేసింది. అంతేకాదు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడే జట్ల జాబితాలో చివరిదైన 20వ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఒకప్పుడు ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో ఒక జట్టుగా పేరు సంపాదించుకున్న జింబాబ్వే, టెస్ట్ హోదా కూడా పొందింది. క్రమేపీ ఆ జట్టు తన పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది. నెమ్మదిగా క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ స్థాయికి ఆటగాళ్లను తీర్చిదిద్ద లేకపోయింది. దీంతో క్రికెటర్లు అరాకొర సౌకర్యాలతో ఈ మేటి జట్లను ఢీకొట్టలేక చతికిల పడ్డారు. చివరికి టీ 20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ లో కూడా గెలవలేకపోయింది. తనకన్నా అతి చిన్న జట్ల చేతుల్లో కూడా ఓటమి పాలై.. వెనక్కి మళ్లింది.
ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో తొలుత రువాండా బ్యాటింగ్ చేసి 18.5 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఉగాండా 8.1 ఓవర్లలోనే ఛేదించి ఘనవిజయం నమోదు చేసుకుంది. ఇటీవలే ఆఫ్రికాకు చెందిన నమీబియా కూడా ఈ వరల్డ్ కప్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
2024 టీ20 వరల్డ్ కప్ ఆడే 20 జట్లు : వెస్టిండీస్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజీలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా.