Chirala: మీకు దుబాయ్ శీను సినిమా గుర్తుందా? దుబాయి వెళ్లి డబ్బు సంపాదించాలనుకుని.. ముంబైలో ఓ మధ్యవర్తిని కలిసి మోసపోతారు. సేమ్ సీన్ చీరాలలో రిపీట్ అయింది. ముగ్గురు యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. టికెట్ కలెక్టర్ పోస్టులు ఇప్పిస్తామంటే నమ్మేశారు. ఐడీ కార్డులిస్తే ఉద్యోగంలో కూడా చేరిపోయారు. చివరికి అసలు గుట్టు బయటపడి దొరికిపోయారు.
డిగ్రీలు చదివిన ఆ ముగ్గురు యువకులు.. ఓ వ్యక్తి రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ కొలువులంటే నమ్మేశారు. నకిలీ ఐడీ కార్డులు, కోటు ఇస్తే రైలెక్కేశారు. శిక్షణ పేరుతో రైలులో కేసులు రాస్తూ.. రైల్వేలో వసూళ్ల పర్వానికి తెరలేపారు. వీరిలో ఓ యువకుడు.. అసలైన టీసీ కంట పడటంతో బండారం మొత్తం బయటపడింది.
బాపట్ల జిల్లా చీరాలలో నకిలీ టీటీఈల వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ జిల్లాకు చెందిన కల్యాణ్, గణేష్, మహబూబాబాద్కు చెందిన ప్రవీణ్ నిరుద్యోగులు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిప్రసాద్తో పరిచయం ఏర్పడింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి, వారి నుంచి లక్షల రూపాయల సొమ్ము వసూలు చేశాడు. తర్వాత వారికి టీసీ ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి నకిలీ ఐడీ కార్డులు, జరిమానా పుస్తకాలు అందజేశాడు.
శిక్షణ పేరుతో విజయవాడ-ఒంగోలు మధ్య రైళ్లలో తిరుగుతూ రోజుకు కనీసం 3 కేసులు రాయాలని చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ యువకులు కొద్దిరోజులుగా టికెట్ లేని ప్రయాణికులకు జరిమానా వేస్తూ ఆ డబ్బు తెచ్చి తెనాలి సాయి అనే వ్యక్తికి అందజేస్తున్నారు. ఈ క్రమంలో రోజూ లాగే చీరాల రైల్వే స్టేషన్లో కేసులు రాస్తున్న గణేష్ను అసలైన టీటీఈ రాజేష్ గమనించి, అనుమానం వచ్చి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు.
డిగ్రీ చదివిన యువకులు టీసీ ఉద్యోగాలంటే నమ్మి డబ్బులు ఇవ్వడం.. ట్రైనింగ్లో భాగంగా జరిమానాలు వసూలు చేసి తెమ్మంటే.. అతడికి తీసుకువెళ్లి ఇవ్వడం నమ్మశక్యంగా లేవని, ఇదంతా ప్లాన్ ప్రాకారం జరుగుతున్న నేరం కావచ్చని కొందరు అనుమానిస్తున్నారు.
.
.