ఎన్నికలంటేనే కోట్లతో కూడుకున్న పని.. ఓటు కావాలంటే నోటు పడాల్సిందే.. రాజకీయాలు ఈ పరిస్థితికి వచ్చేసి చాలా ఏళ్లు అయ్యింది. ప్రస్తుతానికి, దీని మార్చే నాయకుడు గానీ, మారాలనుకునే ఓటర్లు గానీ కనుచూపు మేరలో కనిపించట్లేదు. డబ్బులిస్తేనే ఓటు అనే పరిస్థితుల్లో ఎక్కువ మంది ఓటర్లు ఉంటే.. డబ్బులు లేకపోబట్టే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నా అనే రాజకీయ నేతలూ ఉన్నారు. అత్యంత అరుదుగా ఇలాంటి వాళ్లు ఉన్నా వాళ్లు పాపులర్ ఫేసుల్లో అస్సలే ఉండరు. నిజానికి, డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ధైర్యం ఎవ్వరూ చేయరు. ఒకవేళ అలాంటి అమాయక అభ్యర్థులు ఉన్నా.. వారి కోసం ఎన్నికల కమీషన్ వెబ్సైట్లో వీళ్ల అఫిడవిట్ల కోసం బూతద్దాలు పెట్టి వెతకాలి. అలాంటి అఫిడవిట్లు ఉన్నా వాళ్లల్లో దాదాపు అందరూ.. విత్ డ్రా చేసుకున్నవారో, అభ్యర్థిత్వం క్యాన్సిల్ అయినవారో.. ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఒక్కోసారి ఎన్నికల పోటీలో పేదోళ్లు కనిపిస్తుంటారు. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గమ్మత్తు.
ఈసారి తెలంగాణ ఎన్నికల పోటీలో పేదోళ్లు లేకపోలేదు. పేదోళ్లంటే మరీ “బిలో పావర్టీ లైన్”లో ఉన్నోళ్లని అనుకోవద్దు. అలాగని అలాంటి వాళ్లు లేరనీ కాదు. ఇప్పుడు రాజకీయల్లో ఉన్న పాపులర్ నేతలెవ్వరూ అలాంటి వారు కారని అర్థం. ఇక, ఈ పాపులర్ నేతల్లో కొందరు సమర్పించిన అఫిడవిట్లు చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే. “అంత స్థాయి వ్యక్తికి ఉన్న ఆస్తి ఇంతేనా..” అనేంత ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి, ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న పాపులర్ నేతల్లో లక్షల్లో ఆస్తి ఉన్నవారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అదే సమయంలో చిల్ల గవ్వ కూడా లేని అభ్యర్ధులూ కొందరున్నారు. అలాంటి అభ్యర్థుల్లో అడుగు భూమి కూడా స్థిరాస్థి లేని అభ్యర్థిగా బండి సంజయ్ ఉండటం విశేషం. కరీంనగర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ సీటు కోసం పోటీలో ఉన్న ఈ మాజీ పార్లమెంట్ సభ్యుడు తన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తి కేవలం 42 లక్షలు. ఈ ఆస్తి కూడా చరాస్తి మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరానికి 10 లక్షలు పైగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెట్టిన బండి సంజయ్కు కేవలం ఇంతే ఆస్తి ఉందా అంటే.. అవును ఇంతే అనకతప్పదు.
బండి సంజయ్లా కేవలం లక్షల్లో మాత్రమే ఆస్తులున్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే, వీరందరూ బండి సంజయ్ అంత ఫేమస్ కాకపోయినా కొంత కాలం నుండి రాజకీయాల్లో ఉన్నవాళ్లూ ఉన్నారు. ఇప్పుడే కొత్తగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులూ ఉన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీకి దిగిన అభ్యర్ధుల్లో దాదాపు 90 శాతం మంది కోటేశ్వరులే అయితే, 10 శాతం మందిలో లక్షాధికారులు 90 శాతానికి పైగానే ఉన్నారు. ఇక, మిగిలివారి కెపాసిటీ వేలల్లోనే.. అవి కూడా లేకుండా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులూ లేకపోలేదు.
చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె శంకర్ ఆస్తి కూడా లక్షల్లోనే. ఇక, ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెడ్మ బొజ్జు పటేల్ ఆస్తి 15 లక్షలు.. అది కూడా ఆయన కారు ఖరీదు. అంటే, చేతిలో ఉన్న 10 వేలతోనే బొజ్జు పటేల్ ఎన్నికల బరిలో స్ట్రాంగ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మరో కాంగ్రెస్ అభ్యర్థి, యాకుత్ పురా నుండి పోటీ చేస్తున్న కె.రవిరాజ్ ఆస్తి 3 లక్షల రూపాయలు మాత్రమే.
ఇలాంటి ఇంకొందరు కాక సోషల్ మీడియా పాపులారిటీనే ప్రధాన ఆస్తిగా చేసుకొని ఎన్నికల బరిలో నిలిచిన మరో ప్రత్యేకమైన అభ్యర్థి.. బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నే శిరీష. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీకి దిగిన ఆమె ఆస్తి అకౌంట్లో ఉన్న 15 వందల రూపాయలు. ఆ తర్వాత ఆమె ధైర్యానికి మెచ్చి చాలా మంది సపోర్ట్ చేసినప్పటికీ, ఈ నిరుద్యోగురాలు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమయ్యారు.
రాజకీయాల్లో నిలబడటానికి నిబద్ధత, సామాజిక అవగాహన, ప్రజలకు సేవచేయాలనే తపన, వ్యవస్థను మార్చాలనే ఆశయం మాత్రమే ఉంటే సరిపోతుందని చాలా మందికి ఉంటుంది. అయితే, వాటితో పాటు డబ్బు మాత్రం చాలా ముఖ్యమన్న సంగతి నేటి రాజకీయ వ్యవస్థను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఓటుకు డబ్బు తీసుకోవడం అధికారికంగా మారిపోయి.. ఓటుకు ఇంత తప్పనిసరిగా ఇవ్వాలనే పరిస్థితి దాపురిస్తుందనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరో కోణంలో చూస్తే, ఇప్పుడు ఓట్ల కోసం డబ్బులు వెదజల్లుతున్న నేతలు.. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఓటు రేటుకు విసిగిపోయి… కొంత కాలానికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వకూడదని, అంతర్గతంగా రాజకీయ నేతలంతా నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అలాంటి కాలం కోసం నిజమైన పేద అభ్యర్థులు వేచి చూడాల్సిందే.