తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించనున్నదని పలు జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ప్రీ-పోల్ సర్వేలకు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్ అంచనాలనూ వెల్లడించాయి. పోలింగ్ సరళిని పరిగణనలోకి తీసుకున్న పలు సర్వే సంస్థల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కనుందనే క్లారిటీ ఇచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని ఫస్ట్ ప్లేస్లోకి వస్తున్నదని, పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ సారి రెండో స్థానంలోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. బీజేపీ గతంకంటే కాస్త మెరుగుపడి ఆరేడు సీట్ల వరకు వచ్చినా సింగిల్ డిజిట్ దాటే అవకాశం లేదని పేర్కొన్నాయి. మజ్లిస్ గతంలో ఉన్నట్లుగానే తన స్థానాలను పదిలం చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
గతం కంటే ఎక్కువే వస్తాయని ధీమాగా చెప్పిన BRS 95-105 మధ్యలో ఉంటాయని ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం 80 సీట్లలో గెలుస్తున్నదని, డిసెంబరు 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఫుల్ కాన్ఫిడెన్సును వ్యక్తం చేసింది. ప్రధాన పోటీ BRS వర్సెస్ కాంగ్రెస్గా జరిగినా కొన్ని స్థానాల్లో బీజేపీ ఎంట్రీతో ముక్కోణపు పోటీగా మారింది. 2 ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న విశ్వాసాన్ని కనబర్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మాత్రం BRS తన సీట్ల సంఖ్యను గతంతో పోలిస్తే గణనీయంగా కోల్పోతుండగా కాంగ్రెస్ మాత్రం గతం కంటే మూడు రెట్లు పెరుగుతున్నట్లు తేలింది.
ఈసారి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ.. కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లింది. రెండేళ్ల క్రితం వరంగల్ రైతు డిక్లరేషన్తో మొదలైన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం.. విడతల వారిగా డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను ప్రకటిస్తూ వచ్చింది. ఎన్నికల ముంగిట సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడంతో టీ కాంగ్రెస్కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లైంది. డిసెంబర్ 9న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాలో కాంగ్రెస్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.