తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం అయిపోయింది. ఆ సమయానికి క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. అప్పటి వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
తెలంగాణలో మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 63 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. హైదారాబాద్ మాత్రం ఓటేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపించలేదు. భాగ్యనగరంలో మధ్యాహ్నం 3 గంటలకు 31 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ భారీగా జరిగింది. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లలో చైతన్యం కనిపించలేదు.