Exit Polls : ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎన్నికల రోజు సాయంత్రం 6 గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి అనుమతి ఉండేది. కానీ తాజా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమయంపై సవరణ చేసింది. అరగంట ముందే అంటే సాయంత్రం ఐదున్నర గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గురువారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఆ సమయానికి క్యూలైన్ లో ఉన్నవారికే మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. క్యూలైన్లు ఉన్న ఓటర్ల సంఖ్య ను బట్టి ఈ ప్రక్రియ ముగిసే సమయం ఆధారపడి ఉంటుంది. అయితే పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది.
ఇంతకుముందే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీ స్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. దీంతో 5 రాష్ట్రాల ఎన్నికల పూర్తవుతాయి. అందుకే సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ సర్వేలు ఏ రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం వస్తుందో అంచనాలు ప్రకటించనున్నాయి.