Telangana Election : తెలంగాణలో ఓట్ల పండగొచ్చింది.. అంటూ ప్రజలు సకుటుంబ సపరివారంగా పట్టణాల నుంచి పల్లెలకు బయలుదేరుతున్నారు. చిన్నా పెద్దా, పిల్లా జెల్లా, ఆడా మగా వీళ్లూ వాళ్లని లేదు…అందరూ తమ సొంతూళ్ల బాట పట్టారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, రెండుసార్లో పండగలకి, పబ్బాలకి, లేదా పెళ్లిళ్లకి లేదా ఫంక్షన్లకి సొంత ఊళ్లకి వెళ్లే పని పడుతుంది. వీటితో పాటు ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగకి కూడా అందరూ కలిసి వెళ్లడం కూడా సంప్రదాయంగా మారింది.
ఒకప్పుడు ‘ఏమేస్తాం లే’ ఓటు అనుకునేవారు. ఇప్పుడు మన ఓటు..మనమూ వేద్దాం…ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం అనే స్పృహ అందరిలో వచ్చింది. ఓటు వేయడాన్ని బాధ్యతగా తీసుకుని స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు.
దీంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఎక్కడా ఖాళీ కూడా లేవు. ఒకవైపు ఎన్నికల సామగ్రి తరలించడానికి, సిబ్బందిని తీసుకువెళ్లడానికి చాలా బస్సులను టీఎస్సార్టీసీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రజలను గమ్యస్థానాలు చేర్చి, వారి చేత ఓటు వేయించేందుకు తగిన బస్సులను ఏర్పాటు చేయలేకపోతోంది.
వెయ్యి బస్సులు అదనంగా వేశామని హైదరబాబద్ టీఎస్సార్టీసీ అధికారులు చెబుతున్నా, అది ఉత్తదేనని, అంతా కంటి తుడుపు చర్యగా చెబుతున్నారని అంటున్నారు. ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్న టీఎస్సార్టీసీ కొత్త బస్సులు వేసిందని చెబితే నమ్మేవాళ్లు ఎవరూ లేరని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రమంతా అలాగే ఉంది. ముఖ్యంగా జంట నగరాల నుంచి రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాలకు వెళ్లే వాళ్లతో జూబ్లీ హిల్స్ బస్టేషన్ మహా రద్దీగా ఉంది. బస్సు రాగానే పొలోమని పరుగులు పెడుతున్నారు. నిమిషాల్లోనే బస్సు నిండిపోతోంది. గొడవలు, అల్లర్లు, కేకలతో బస్టాండ్ దద్దరిల్లిపోతోంది. సాయంత్రం 5 గంటలలోపు ఊళ్లలో దింపేస్తే చాలురా.. భగవంతుడా…అని టీఎస్సార్టీసీ
అధికారులు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు.
మరోవైపు బస్సెక్కి ప్రధాన ఊళ్లల్లో దిగి, అక్కడ నుంచి మారుమాల గ్రామాలకు వెళ్లేందుకు ఆటోవాళ్లు భారీగా డిమాండ్ చేస్తున్నారని వినికిడి. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వాళ్లు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్లయితే ప్రధాన పార్టీలు ఆటోలను ఏర్పాటు చేశాయి. ఇవి ఎన్నికల నిబంధనలకు విరుద్డంకానీ, అన్నీ అలా జరగవు కదా .ముందు ఓటు వేయిస్తే అంతే చాలని అధికారులు కూడా చూసీ చూడనట్టు వెళ్లిపోతున్నారు.
ఇందులో అంతర్లీనంగా చెప్పే మాటేమిటంటే ఓటుకి రూ.2 వేలు, రూ.3 వేలు ఇస్తున్నారని తెలిసి కూడా చాలామంది వెళుతున్నారని ఒక టాక్ నడుస్తోంది. ఇదండీ సంగతి.. అందుకే ఇది ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగని అంటారు.