Telangana Elections : తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అనుకుంటుండగా.. పలు పోలింగ్ కేంద్రాల వద్ద వాగ్వాదాలు, గొడవలు జరిగాయి. కామారెడ్డిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ఎలా జరుగుతుందో చూసేందుకు వెళ్లిన కొండల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేత ముజుబుద్దీన్ లోకల్.. నాన్ లోకల్ అంటూ ఓవరాక్షన్ చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది.
కొండల్ రెడ్డి, అతని వర్గాన్ని పోలింగ్ కేంద్రాలు పరిశీలించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని పీఎస్ కు తరలించారు. తన వాహనం కనిపించకపోవడంతో కొండల్ రెడ్డి అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దాంతో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు వారందరినీ లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అలాగే జనగామ జిల్లా 245వ నెంబర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మధ్య ఘర్షణ జరగ్గా.. పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు.
గద్వాల జిల్లా ఐజా ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేతలు – పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు తమను ప్రలోభాలకు గురిచేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా.. సీఐ స్వల్పంగా లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మంలం కరన్కోట్ గ్రామంలోని కోటవీధిలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద కొందరు ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసుల కంటపడ్డారు. పోలీసులను గమనించి.. డబ్బు సంచిని అక్కడే వదిలి పరారయ్యారు. స్పాట్లో 7 లక్షల45 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి పరిశీలించారు . గుర్తులు కనపడకుండా ఈవీఎంలను చీకట్లోపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైట్ పడకుండా కిటికీలు కూడా మూసివేయడం కరెక్టు కాదన్నారు. ఎమ్మార్వోతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఈవీఎంలపై ఉన్న గుర్తులు కనపడేలా లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భద్రాద్రిజిల్లా జూలురుపాడు మండలం నల్లబండబోడులో.. తారురోడ్డు వేయలేదంటూ గ్రామస్తులు ఓటు వేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.