CEO Vikasraj: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల పై ఏపీ పోలీసులు బుధవారం అర్థరాత్రి హంగామా చేశారు. 13వ గేటు వరకూ తమ పరిధిలోకి వస్తుందంటూ ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఉండగా.. వాటిలో 13వ గేట్ వరకూ తమ పరిధిలోకి వస్తుందంటూ.. ఏపీ పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి మొబైల్ ఫోన్లను, డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్ వద్దకు చేరుకుని ముళ్లకంచెను ఏర్పాటు చేసి.. డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ పైకి చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నీటి నిర్వహణ విషయం నీటిపారుదల శాఖకు సంబంధించిందని, వెంటనే ముళ్లకంచెను తొలగించాలని ఏపీ పోలీసులకు సూచించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో ఆయన సిబ్బందితో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ అంశంపై సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం గురించి పోలీసులే చూసుకుంటారని, రాజకీయనేతలు తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. నేతలెవరూ ఎలక్షన్ నిబంధనలను అతిక్రమించొద్దని విజ్ఞప్తి చేశారు. సనత్ నగర్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.