Telangana Elections | రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ఒకలెక్క .. కొన్ని నియోజకవర్గాల్లో మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న స్థానాలపై స్పెషల్ ఫోకస్ నెలకొంది. ఇవే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల పోరు ఆసక్తికరంగా.. ఉత్కంఠగా మారింది.
Telangana Elections | రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ఒకలెక్క .. కొన్ని నియోజకవర్గాల్లో మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న స్థానాలపై స్పెషల్ ఫోకస్ నెలకొంది. ఇవే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల పోరు ఆసక్తికరంగా.. ఉత్కంఠగా మారింది. మంత్రులు పోటీ చేస్తున్న చోట కూడా గట్టి పోటీ నెలకొనగా రిజల్ట్ ఎలా వస్తుందో అని సట్టింగ్లకు గుబులు పట్టుకుంది. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగానూ గతానికి భిన్నంగా ఈసారి నేరుగా టాప్ లెవల్ లీడర్లు ముఖాముఖి ఢీ కొట్టడం హీటెక్కిస్తోంది. అలాగే మరికొందరు అభ్యర్థులు అనూహ్యంగా హైలైట్ అయిన తీరు సంచలనంగా మారింది.
తెలంగాణలో ఈసారి ఎన్నికలు స్పెషల్గా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు చోట్లో పోటీ ఆసక్తికరంగా మారింది. కామారెడ్డిలో కేసీఆర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గట్టి సవాల్ విసురుతున్నారు. గజ్వేల్లో కేసీఆర్ను బీజేపీ నుంచి ఈటల రాజేందర్ నేరుగా ఢీ కొడుతున్నారు. గతంలో ఇలా పెద్దనేతలు నేరుగా తలపడిన దాఖలాలు లేకపోవడం ఈసారి హాట్ టాపిక్గా మారింది. అలాగే కేసీఆర్ తరహాలోనే రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్ రెండు నియోజకవర్గాల్లో పోటీకి దిగి గట్టి సవాల్ విసిరారు. కొడంగల్లో రేవంత్ రికార్డు మెజార్టీతో గెలుస్తారని బెట్టింగులు జరుగుతున్నాయంటే క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది. అలాగే హుజూరాబాద్ రేసులోనూ ఉన్న ఈటల ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి కోడ్ ఉల్లంఘించి సెంటిమెంట్ పండించాలని ప్లాన్ చేయగా ఈసీ నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు అగ్రనేతల పోటీతో పాటు రాష్ట్రంలో మంత్రుల నియోజకవర్గాలపైనా ఈసారి ప్రత్యేక దృష్టి నెలకొంది.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్కు గట్టి పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి స్ట్రాంగ్గా ఎదుర్కొంటున్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న గడ్డపై బీజేపీ నుంచి రాణిరుద్రమ పోటీ చేస్తున్నారు. వీళ్లకు తోడు ఇద్దరు పద్మశాలీ అభ్యర్థులు ఓట్ ఫర్ లోకల్ నినాదంతో కేటీఆర్కు షాక్ ఇస్తున్నారు. స్థానికతను తెరపైకి తీసుకువచ్చి కౌంటర్ ఇస్తున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్, బీజేపీ నుంచి బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. ముగ్గురూ మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు కావడం వల్ల ఈసారి ఫలితం ఎలా ఉంటుందో అని గంగుల టెన్షన్ పడుతున్నారు.
మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు పాలకుర్తిలో షాక్ తప్పేలా లేదనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి యశస్వినిరెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. 26 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా యశస్వినిరెడ్డి ప్రజల మనసులు చూరగొంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఆయన చేరినప్పటి నుంచే ప్రకంపనలు సృష్టించారు. పాలేరులో ఉపేందర్రెడ్డిని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బెంబేలెత్తిస్తున్నారు. ఇక్కడ సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్నా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు. మధిరలో భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజ్ను కంగారెత్తిస్తున్నారు. బీజేపీ నుంచి కోరుట్ల అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ పోటీపైనా ఆసక్తి నెలకొంది. గద్వాల గడీలో ఈసారి డీకే అరుణ పోటీకి దూరంగా ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా పోటీకి దూరంగా ఉన్నారు. అలాగే కొల్లాపూర్లో బర్రెలక్కగా ఫేమ్ అయిన శిరీషకు అనూహ్య మద్దతు లభించింది. నిరుద్యోగుల ప్రతినిధిగా పోటీ చేశానని చెబుతుండగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక మంత్రి జగదీశ్రెడ్డిపై ఆయన పీఎస్ వట్టె జానయ్య పోటీ చేయడం సంచలనం రేపింది. వట్టె జానయ్య మంత్రిపై కిడ్నాప్ ఆరోపణలు చేశారు. ఆయనపై దాడి జరగడం సానుభూతి దక్కేలా చేసింది.
బీఎస్పీ నుంచి సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీపైనా స్పెషల్ ఫోకస్ నెలకొంది. అలాగే కొత్తగూడెంలో బీఆర్ఎస్ టికెట్ దక్కని జలగం వెంకట్రావు AIFB నుంచి పోటీ చేస్తున్నారు. ఎప్పటిలాగే గోషామహల్లో మజ్లిస్ పార్టీ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్పై పోటీకి అభ్యర్థిని పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై జూబ్లీహిల్స్లో MIM అభ్యర్థిని పోటీకి దింపడం రాజకీయ దుమారం రేపింది. ఈసారి బీజేపీ ఎక్కువ చోట్ల అభ్యర్థులను బరిలో దింపడం.. బుజ్జిగింపులతో రెబల్స్ ముప్పు తగ్గిపోవడం స్వతంత్ర, చిన్నపార్టీల అభ్యర్థుల సంఖ్య తగ్గిపోయేలా చేసింది. ఈసారి మరో స్పెషాల్టీ ఏంటంటే.. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు చోట్లా అభ్యర్థులు భారీగా పోటీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.