Telangana Elections | తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న పల్లెజనం భారీగా ఊర్లకు బయల్దేరారు. మ్యాగ్జిమమ్ జనం ఓట్లు వేసేలా అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. లోకల్ ఎలక్షన్స్ను తలపించేలా జనం స్వగ్రామాలకు చేరుతున్నారు. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉండగా..
Telangana Elections | తెలంగాణలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న పల్లెజనం భారీగా ఊర్లకు బయల్దేరారు. మ్యాగ్జిమమ్ జనం ఓట్లు వేసేలా అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. లోకల్ ఎలక్షన్స్ను తలపించేలా జనం స్వగ్రామాలకు చేరుతున్నారు. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉండగా.. ఏ చాన్స్ మిస్సవకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోల్మేనేజ్మెంట్ పక్కాగా అమలు చేసి విజయ తీరాలు చేరేలా ప్లాన్స్ వర్కౌట్ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 13 సమస్యాత్మకమైన ప్రాంతాలు మినహా మిగతా చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 ప్రాంతాల్లో 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటు హక్కు వినియోగించుకోవాలి. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుండగా.. 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా వారిలో 221 మహిళలు ఉన్నారు. అత్యధికంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 48 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. హరీష్రావు పోటీ చేస్తున్న సిద్దిపేటలో 21 మంది, కేటీఆర్ ఇలాఖా సిరిసిల్లలో 21 మంది, కొడంగల్లో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 59,779 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అభ్యర్థుల నమూనా పత్రాలు, ఈవీఎం మెషీన్లు, వీవీప్యాట్స్, ఇంక్, ఎన్నికల ఇతరత్రా సామగ్రిని పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది సామాగ్రితో చేరుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వాళ్లలో 1,62,98,418 పురుషులు కాగా.. 1,63,01,705 మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే 3,287 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. రాష్ట్రంలో ఈసారి 9.9 లక్షల మందికి మొదటి సారి ఓటు హక్కు లభించింది. ఇప్పటికే 27వేల మంది వృద్ధ, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. తెలంగాణ ఎన్నికల జాతర ఓట్ల పండుగ సందర్భంగా ఓటర్లు సొంతూళ్ల బాటపట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైన ఆయుధమో తెలుసుకొని.. వజ్రాయుధమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు తరిలివెళ్లారు. రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు కిటకిటలాడాయి. విద్య, ఉపాధి కోసం తమ సొంతూరును వదిలి పలు ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు ఇప్పటికే అభ్యర్థుల నుంచి ఫోన్లు వచ్చాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావాలనే పిలుపుతో జనం ఊరి బాట పట్టారు.
తెలంగాణలో ఈసారి కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దాదాపు 70 నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అన్నట్లుగా ఫైట్ సాగనుంది. అలాగే మరో 40 నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ 40 చోట్ల సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపును సవాల్గా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు నగరంలో ఉంటున్న పల్లె ఓటర్లపై ఫోకస్ పెట్టారు. రవాణా ఖర్చులు భరిస్తూ స్వగ్రామాలకు రప్పిస్తున్నారు. అలాగే కొందరు ప్రత్యేకంగా వాహనాలు సమకూరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకొన ఓటు వేసేలా బాధ్యతలు అప్పగించారు. గతం కంటే అన్ని నియోజకవర్గాల్లోనూ ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.