Telangana Polling | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ప్రధానమో.. అందుకు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. ఓటరు పోలింగ్ బూత్కు వచ్చే వరకు భద్రతా చర్యలు తీసుకోవడం ఎన్నికల అధికారుల విధి. ఇటు పోలీసులు… అటు ఎన్నికల అధికారులు సంయుక్తంగా పోలింగ్ ప్రక్రియను చేపడతారు. ఈ ప్రక్రియంతా ముగిసే వరకు ఎన్నికల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే.
Telangana Polling | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ప్రధానమో.. అందుకు అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. ఓటరు పోలింగ్ బూత్కు వచ్చే వరకు భద్రతా చర్యలు తీసుకోవడం ఎన్నికల అధికారుల విధి. ఇటు పోలీసులు… అటు ఎన్నికల అధికారులు సంయుక్తంగా పోలింగ్ ప్రక్రియను చేపడతారు. ఈ ప్రక్రియంతా ముగిసే వరకు ఎన్నికల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. ఇదంతా ఓ పద్దతి ప్రకారం పూర్తి చేసేందుకు పోలింగ్ కేంద్రాలను డివైడ్ చేసుకొని సెక్యూరిటీ కల్పిస్తారు. ఓటింగ్ అయిపోయ్యాక ఈవీఎంలు భద్రంగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే వరకు డేగ కన్నేసి ఉంచుతారు. తెలంగాణ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలుసుకుందాం…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత కల్పిస్తున్నారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులు లక్షమంది సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అడిషనల్ ఫోర్స్ను రెడీ చేశారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12 వేల సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 4,400 సున్నితమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి అదనంగా సిబ్బందిని నియమించారు. 45 వేల మంది రాష్ట్ర పోలీసులు, 45 వేల మంది కేంద్ర బలగాలు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 20 వేల మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్నికల విధుల్లో ఉన్నారు.
తెలంగాణలో 13 సమస్యాత్మక నియోజక వర్గాలుగా అధికారులు గుర్తించారు. ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో నాలుగు గంటల వరకే ఓటు హక్కు వినియోగించుకోవాలి. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు మొత్తం 614 ఉన్నాయని లెక్కతేల్చారు. కొత్తగూడెంలో 225, ములుగు 118, భూపాలపల్లి 75, అసిఫాబాద్ 61, రామగుండం 46, అదిలాబాద్ 44, మహబూబాబాద్ 28, నిర్మల్లో 17 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత కేంద్రాలలో కేంద్ర బలగాల మొహరించారు. మావోయిస్టు ప్రభావిత పోలీంగ్ స్టేషన్లు కేంద్రబలగాల ఆధీనంలో వెళ్లాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. కేంద్ర బాలగాలు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాయి.
ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే ముందుకు కదలనిస్తున్నారు. అనుమానితులపై డేగ కన్నేశారు. అటవీ ప్రాంతాల్లో కూబింగ్ను విస్తృతం చేసి జల్లెడ పడుతున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎన్నికల ప్రచారపర్వం ముగింపు రోజున మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉన్న చర్ల మండల శివారు అటవీప్రాంతం పూసుగుప్ప గ్రామంలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని తగులబెట్టారు. ఈ ఘటనతో అటవీగ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు భారీగా ఆ ప్రాంతంలో మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్కి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు పెంచారు.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గిపోగా ఎన్నికల వేళ జరిగిన ఘటన పోలీసులతో పాటు స్థానికులను కూడా ఉలిక్కిపడేలా చేసింది. పోలింగ్కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మరింత పక్కాగా భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందవద్దని సమమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం భద్రత కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు.