Facts about Election Ink : భారతదేశంలో.. ఏ రాష్ట్రంలోనైనా ఐదేళ్లకు ఒకసారి జరిగే పోలింగ్ బూత్ ల దగ్గర ఒకటే సందడి నెలకొంటుంది.. ఓటు వేసేందుకు.. కొందరు బాధ్యతగా వెళతారు. కొందరు ఇంట్రస్ట్ గా వెళతారు. కొందరు తప్పదురా బాబూ.. అన్నట్టు వెళతారు.. కొందరు అలా చూసొద్దాం, వేసొద్దాం అన్నట్టు వెళతారు.
కానీ పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం ఈసారైనా తమ బతుకులు బాగు పడతాయేమేననే భావనతో గంటల తరబడి లైన్లలో నిలుచుని మరీ ఓటేసి వస్తారు.
సరే..ఓటేసి బయటకి వచ్చిన తర్వాత
ఏం అన్నా ఓటేసేవా? ఏం అక్కా ఓటేసేవా?
ఏమేవ్ భార్యామణి ఓటేసావా?
ఏమండీ.. ఓటేశారా లేదా?
డాడీ, మమ్మీ నాకు కొత్తగా ఓటొచ్చింది.. వేసొచ్చా..
ఇలా అందరూ అనగానే..
వారందరి నోటి నుంచి ఒకటే మాట వస్తుంది..
‘ఏది చూపించు’
అనగానే అందరూ ఇదిగో అంటూ.. ఠక్కున చూపుడు వేలు మీద పడిన సిరా చుక్కను చూపిస్తారు.
అది చూపించేటప్పుడు ప్రతి ఒక్కరి మోములో చిన్న ఆనందం, గర్వం తొణికిసలాడుతుంది.
ఈ సువిశాల భారతావనిని పరిపాలించే నాయకులు, రాష్ట్రాలను పరిపాలించే నేతలలో మీకు నచ్చిన వారికి ఓటు వేసి, దేశ భవిష్యత్తుని దిశా నిర్దేశం చేసే మహాద్భాగ్యాన్ని కలిగించే మహత్తరమైన ఓటును మీరు వేశారనడానికి నిదర్శనమే.. ఈ..‘సిరా చుక్క’
ఈ సిరాచుక్క చెరిపేస్తే చెరిగిపోదు, తుడిచేస్తే మాసిపోదు.
ఈ సిరా చుక్క వల్ల లాభం ఏమిటంటే, ఆ ఇంకు ముద్ర వేసిన తర్వాత 72 గంటల వరకు చెరిగిపోదు. మరొకసారి బోగస్ ఓటు అదే దొంగ ఓటు వేయడానికి అవకాశం ఉండదు.
ఈ సిరా ఇంకును కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేస్తుంది. 1962లో కేంద్ర ప్రభుత్వం.. ఈ సిరా ఉత్పత్తి కోసం.. ఈ కంపెనీకి అనుమతిచ్చింది. అందులో కొన్ని కండీషన్లు పెట్టి మరీ బాధ్యతలను అప్పగించింది.
నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీస్ ఫార్ములాతో మాత్రమే సిరా ఉత్పత్తి చేయాలనే కండీషన్ తోనే ఈ కంపెనీకి ఆర్డర్ అప్పగించారు. మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్-4 , 1937లోనే ఈ ఫ్యాక్టరీని స్థాపించారు.
ఆరోజుల్లో బాల్ పెన్స్ ఉండేవి కావు. అన్నీ ఇంకు పెన్నులు, కలంలు మాత్రమే ఉండేవి. పాళీని ఇంకు బాటిళ్లలో ముంచి పేపర్ల మీద రాసేవారు. అందుకే ఇంకు ఫ్యాక్టరీలకు అంత డిమాండ్ ఉండేది. కాలక్రమంలో ఇంకు పెన్నులు ఇప్పుడు కనుమరుగై పోయాయి.
ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇంకునే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఓటు గుర్తు వేసే సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. ఇదే దీని సీక్రెట్ అని చెప్పాలి.
ఈ ఇంకు చుక్కని ఎలా వేయాలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ఉన్నాయండోయ్.
37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును వేయాల్సి ఉంటుంది. దీనిని చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది.
2006 ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కిందివరకు సిరా గుర్తువేస్తున్నారు. అంతకన్నా ముందు గోరు పైభాగంలో వేసేవారు.
తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఇంకు తయారవుతోంది. రాయుడు ల్యాబరేటరీస్లో తయారు చేస్తున్నారు. పోలియో డ్రాప్స్ వేసే సమయంలో గుర్తు పెట్టేందుకు కూడా ఈ ఇంకు చుక్కలని వినియోగిస్తున్నారు. ఇంకా ఎన్నికల సమయంలో కూడా వాడుతున్నారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు సుమారు 2 లక్షలకు పైగా సిరా బాటిళ్లు సిద్ధమైనట్టు సమాచారం.
మనదేశంలోనే కాదు సిరాచుక్కకు అంతర్జాతీయంగా కూడా ఎంతో డిమాండ్ ఉంది. 1976 నుంచి మొత్తం 29 దేశాలకు ఇండియా నుంచే ఇంకు ఎగుమతి అవుతోంది. మయన్మార్, ఇరాక్, శ్రీలంక, సిరియా, ఇండోనేషియా, లెబనాన్, టర్కీ, ఈజిప్టు, సూడాన్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, నేపాల్ తదితర దేశాల్లో ఇదే సిరాను వినియోగించడం విశేషం.
మన సిరా చుక్క కథ.. వెనుక ఎంత చరిత్ర ఉందో.. చూశారు కదండీ..
అందుకే బాధ్యతగా ఓటు వేయండి.. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఓటరే వెన్నెముక అని నిరూపించండి..