తెలంగాణలో ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి ఫోకస్ తెలంగాణపైనే ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై దేశ నలుమూలల బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. గతవారం రోజుల్లో ఈ ఎన్నికలపై ఉత్కంఠ మూడింతలు పెరిగింది. రాజకీయ నేతలనే కాదు.. సామాన్యుడిని కదిపినా.. తెలంగాణ ఎన్నికల గురించే ప్రస్థావిస్తున్నారు. దీంతో.. బెట్టింగ్ యాప్ లు, బుకీలు ఈ ఉత్కంఠను క్యాచ్ చేసుకునే పనిలో పడ్డాయి.
ఇప్పటి వరకు 3 వేల కోట్లకు పైగా బెట్టింగులు జరిగినట్టు తెలుస్తోంది. పోలింగ్ తర్వాత ఈ బెట్టింగుల వేగం మరింత పుంజుకుంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత.. కౌంటింగ్కి ముందు ఈ బెట్టింగులు 10 వేల కోట్ల వరకూ చేరే ఛాన్స్ ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా బెట్టింగులు నిర్వహిస్తే.. పోలీసుల నిఘా ఉంటుందని.. దేశంలో నలుమూల నుంచి బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా కేంద్రంగా జరుగుతున్నాయి. ఇక ఏపీలో కూడా విచ్చల విడిగా బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది.
అయితే, తెలంగాణ ఫలితాలపై.. తెలంగాణ ప్రజల కంటే.. ఏపీ ప్రజలే ఎక్కువగా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. పందాలకు మారు పేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో జోరుగా బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. వాళ్ల వాళ్ల స్థాయిని బట్టి కోట్లు, లక్షలు, వేలు, వందల్లో పందాలు వేస్తున్నారు. కొందరు అయితే.. భూములు, చేపల చెరువులు కూడా బెట్టింగులో పెడుతున్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, ఆ పందాలను ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదని తలలు పట్టుకుంటున్నారు.