ఇప్పటి వరకు ఎన్నికలన్నీ ఒక తరహాలో జరగ్గా.. ఈసారి మరో తరహాలో వేడెక్కాయి. విపరీతమైన మౌత్ టాక్.. రాజకీయ పార్టీలను షేక్ చేసింది. ఎవర్ని కదిలించినా ఒకవైపే చూడు అన్నట్లుగా సాగిన నోటి మాట బలంగా వినిపించింది. మరి మాటలు కోటలు దాటుతాయా..? గడప దాటి ఓటేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. మౌత్ టాక్ ఎవరికి జీవన్మరణ సమస్యగా మార్చనుందనేది తేలాల్సి ఉంది. ఇక సైలెంట్ ఓటర్ల విషయంపైనా పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. గుంభనంగా ఉన్న సైలెంట్ ఓటర్లు బ్లోఅవుట్లా బ్లాస్టై రిజల్ట్ను తారుమారు చేస్తారా అనే ఆందోళన నెలకొంది. మరి ఇటు మౌత్ టాక్.. అటు సైలెంట్ ఓటర్ల నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉండనుంది..? ఎవరికి గండంగా మారనుంది..? ఈ రెండు అంశాలు కూడా ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి.
వ్యాపారం, వాణిజ్యం, సినిమా, విద్య, వైద్యం, రియలెస్టేట్, రాజకీయం.. ఇలా ఏ రంగమైనా రాణించాలంటే ప్రధానంగా కావాల్సింది మార్కెటింగ్. వస్తువు ఎంత నాణ్యతగా తయారు చేశామనేకంటే ఎంత అందంగా ప్యాక్ చేశామనేదే నేటి పోటీ ప్రపంచంలో ప్రధాన సూత్రంగా మారిపోయింది. తయారీ రంగం కంటే మార్కెటింగ్ రంగానిదే డామినేషన్. ఓ వస్తువు మంచి చెడు, దాని ఫలితాలు.. ఉపయోగాలు తెలియాలంటే అందుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం ప్రధానం. సరిగ్గా రాజకీయాల్లోనూ ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మేం గెలుస్తామంటే.. మాదే విజయం అంటూ పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. రకరకాల సర్వేలు, సొంత లెక్కలు వేసుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, గ్రౌండ్లో వాస్తవ పరిస్థితి ఏంటనేది మాత్రం మౌత్ పబ్లిసిటీతోనే తెలిసిపోతోంది. ఈసారి సామదాన దండోపాయాలు ఎన్ని వాడినా ఓటర్ల నాడి అంతు చిక్కకుండా ఉండటం రాజకీయ పార్టీలను టెన్షన్ పెట్టిస్తోంది. ఒక పార్టీకి అనుకూలంగా మౌత్ పబ్లిసిటీ ఉందనే టాక్.. మరో పార్టీని కలవర పెడుతోంది. దీనికి తోడు ఈసారి సైలెంట్ ఓటింగ్ పెద్దఎత్తున ఉండనుందనే ప్రచారం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
నోటి మాట. మౌత్ టాక్. దీనికున్న పవర్ అంతాఇంతా కాదు. ఒకరి చెవిలో ఏదైనా విషయం పడిందంటే అది ఊరంతా తెలిసేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టదు. అందులోనూ నేటి డిజిటల్ యుగంలో దాని స్పీడ్ రాకెట్ కంటే వేగంగా మారిపోయింది. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు విషయం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే సోషల్ మీడియా వచ్చాక ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. నిజాల కంటే ఫేక్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. అయితే నోటి మాటకి ఉండే శక్తి మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు. ఒకరు విన్నది.. మరొకరు చెప్పింది.. చెవులు మారకుండా.. అసలు అభిప్రాయం ఏంటి అనేది ఎవరైనా నేరుగా చెప్పగలిగేదే నోటిమాట. అందుకే దానికి అంత వ్యాల్యూ ఉంది. ఇప్పుడు ఎన్నికల్లోనూ చాలా మంది మౌత్ పబ్లిసిటీనే విశ్వసిస్తున్నారు. గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునేందుకు నేరుగా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో నోటిమాటతోనే అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇది మరింత ఎక్కువగా పాకిపోయింది. నెల రోజుల ప్రచార వ్యవధిలో వరుసగా పండగలు రావడం. దసరా, దీపావళి వంటి పెద్ద పండగలకు జనం ఊర్లకు చేరడం మౌత్ పబ్లిసిటీని మరింత అధికం చేసింది. ఈసారి ఆ పార్టీనే గెలుస్తుందటగా అనే టాక్ ఓ ఊపు ఊపేసింది. నేతలను షేక్ చేసింది.
దేశవ్యాప్తంగా మీడియా రంగం కూడా విశ్వాసం కోల్పోయిందనే అపవాదు ఉంది. పార్టీల వారీగా ప్రధాన మీడియా అజెండాలు ఫాలో అవుతోందనేది సామాన్యులకు కూడా తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో జనం ఎవరివైపు ఉండాలనే నిర్ణయం తీసుకోవడం కొంత క్లిష్టంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం మౌత్ టాక్ ద్వారానే పెద్దఎత్తున జరిగింది. రచ్చబండ, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, సెలూన్లు, టీ స్టాల్స్, బస్సులు, రైళ్లు, కూరగాయల మార్కెట్లు, సెల్ఫోన్ సంభాషణలు ద్వారా జనాభిప్రాయం ఒకరి నుంచి ఒకరికి వ్యాపించింది.
బలమైన మాధ్యమంగా మౌత్ టాక్ మారిపోయింది. ఇదంతా ఓ పార్టీకి అనుకూలంగా జరగడం ఆ పార్టీకి అండర్ కరెంట్లా పనిచేయనుందనే చర్చ జరుగుతోంది. మౌత్ టాక్ గండాన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. ఫలానా పార్టీ గెలవబోతోందని చెప్పేవాళ్లు అసలు ఓట్లు వేస్తారా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో అభిప్రాయాలు షేర్ చేసుకోవడం కామన్. ఒకరికి కరెక్ట్ అనిపించింది.. మరొకరికి తప్పుగా ఉండొచ్చు. రచ్చబండపై జరిగే చర్చల్లో చివరికి మాత్రం ఓ కన్క్లూజన్ ఉంటుంది. దాన్నే చాలా మంది ఏకీభవిస్తారు. ఎన్నికల్లోనూ ఈసారి మౌత్ టాక్ ఫలిస్తుందని ఒక పార్టీ భావిస్తుండగా.. అలాంటి చాన్స్ లేదని మరో పార్టీ తిప్పికొడుతోంది.
ఈసారి సైలెంట్ ఓటర్ల ప్రభావం ఎలా ఉండనుందనే విషయం రాజకీయా పార్టీలను టెన్షన్ పెట్టిస్తోంది. సైలెంట్ ఓటర్లు అంటే వీళ్లు ఎవరికీ అంతు చిక్కరు. నోరు తెరిచి తమ అభిప్రాయాలు చెప్పరు. సోషల్ మీడియాలోనూ పార్టిసిపేట్ చేయరు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లు గోడమీద పిల్లుల్లాంటి వాళ్లన్నమాట. బాహాటంగా మాట్లాడి బద్నాం అయ్యేందుకు ఇష్టపడరు. ఇలాంటి వాళ్లు ఫలితాలు తారుమారు చేసే స్థాయిలో ఉంటారు. సైలెంట్ ఓటర్లు ఒక పార్టీలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీకే ఓటు వేస్తారనే గ్యారెంటీ ఉండదు. సైలెంట్గా తమపని తాము కానిచ్చేస్తారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉంటారు. బయటపడితే ఎక్కడ సంక్షేమ పథకాలు కట్ చేస్తారో అనే ఆందోళన కనిపిస్తుంది. మరోసారి అదే సర్కార్ వస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తారనే ఆలోచన సైలెంట్ ఓటర్లది. రిస్క్ చేసి బయటపడటం ఎందుకనేది వాళ్ల ఆలోచన. అయితే ఈసారి ఇలాంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. పథకాల పేరుతో లోకల్ కేడర్ డామినేషన్ చేస్తున్నారనే భావన అధికంగా ఉందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి ఓటు బ్యాంకుపై పార్టీలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. వాళ్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సైలెంట్ ఓటర్లు తమవైపే ఉంటాలని ధీమాగా చెబుతున్నాయి.
సైలెంట్ ఓటర్లు ఎంత వయలెంట్గా రియాక్ట్ అవుతారనేది ఫలితాల్లో తేలనుంది. తమ మనోభావాలు అణచిపెట్టుకుంటూ ఇన్నాళ్లూ పడిన వేదనను ఓటు రూపంలో కసి తీర్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది. మౌనం అగ్నిపర్వతంలా బద్ధలై ఏ పార్టీకి షాక్ ఇవ్వనుందనేది తేలాల్సి ఉంది.
.
.