తెలంగాణ ఎన్నికల వేళ వడ్డించే వాడు మనోడైతే అన్న తీరున వ్యవహరిస్తున్నారు పోలీసులు. ప్రతిపక్ష నేతల పట్ల ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఎలక్షన్కు కౌంట్డౌన్ షురూ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈసీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే.. అధికారులకు ఏ రూల్స్ వర్తించవన్నట్టుగా.. అవన్నీ కేవలం విపక్షాలకే అన్నట్టు వ్యవహరిస్తున్న పోలీసుల ఓవరాక్షన్ పట్ల ప్రతిపక్ష నేతలు.. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ సమరానికి సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. దీంతో అధికార పీఠం గులాబీ దళం సొంతం చేసుకుంటుందా..?, లేదంటే హస్తం కైవసమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ ప్రజాక్షేత్ర పోరులో అందరి ఫోకస్ కామారెడ్డిపైనే. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిల పోరుతో ఆ ఇలాఖాలో మీసం మెలేసేదెవరన్న ఆసక్తి క్షణక్షణం పెరుగుతోంది. ఇక రేపటి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కఠినంగా ఈసీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండకూడదన్న నిబంధనను గాలికొదిలేసిన పోలీసులు.. అక్కడి అధికారుల పార్టీ నేతల పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. కాంగ్రెస్ నేతల పట్ల ఓవర్గా రియాక్ట్ అవుతూ వారిని అక్కడ నుంచి పంపే కుట్ర చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిని కామారెడ్డి నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం స్థానికేతరులు ఉండకూడదంటూ దేవునిపల్లిలో నివాసముంటున్న ఆయన కామారెడ్డిని వదిలివెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి భారీగా పోలీసులు తరలివచ్చారు. అయితే.. తాను గత 15 రోజులుగా కామారెడ్డిలో ఉన్నానని.. కాంగ్రెస్ తరపున చీఫ్ ఏజెంట్గా ఉన్నానని చెప్పి, తన ఐడీ కార్డును చూపించినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. కాంగ్రెస్ నేతల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. గులాబీ నాయకుల పట్ల మాత్రం చూసిచూడనట్టు వదిలేస్తుండటంతో హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు.