T20 World Cup 2024 : త్వరలోనే బీసీసీఐ ఒక శుభవార్త చెబుతున్నట్టుగానే కనిపిస్తోంది. అదేమిటంటే టీ 20 వరల్డ్ కప్ 2024కి రోహిత్ శర్మనే కెప్టెన్ గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనికే బాధ్యతలను అప్పగించేందుకు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది.
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ అతనితో అహ్మదాబాద్ లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్ క్రికెటర్లుగా ఉన్న 36 ఏళ్ల హిట్ మ్యాన్ రోహిత్, 35 ఏళ్ల కింగ్ కొహ్లీలపై రాహుల్ అభిప్రాయాన్ని అడిగినట్టు సమాచారం.
బీసీసీఐ ఉద్దేశం వారి రిటైర్మెంట్ గురించా? లేక వాళ్లు ఏమని అనుకుంటున్నారు? కొనసాగాలనా? లేక ఆగిపోదామని అనుకుంటున్నారా? అలాగే ఈ రెండేళ్ల ప్రయాణంలో వారిద్దరిపై మీ అభిప్రాయం ఏమిటి? తదితర అంశాలను చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఆడిన టీమ్ ఇండియాలో హార్దిక్ తర్వాత జట్టుని సమర్థవంతంగా నడిపించగల కెప్టెన్ ఎవరున్నారు? తదితర అంశాలు రాహుల్ నుంచి తెలుసుకున్నట్టు సమాచారం.
ఒక నిజం ఏమిటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ బ్రహ్మాండంగా ఉండటంతోనే వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి నాన్ స్టాప్ గా ఫైనల్ వరకు వెళ్లింది. అంతేకాదు ఓపెనర్ గా బ్రహ్మాండమైన బిగినింగ్స్ ఇచ్చి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కొహ్లీ వరల్డ్ కప్ 2023 లో 765 టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందుకని వీరి కెరీర్ కొనసాగడంపై ఎవరికీ సందేహాలైతే లేవు. అది బీసీసీఐకి కూడా ఉంది.
కాకపోతే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో రోహిత్ శర్మ డిప్రెషన్ లో ఉన్నాడా? వచ్చే ఏడాది టీ 20 ప్రపంచకప్ ని నడిపించగలడా? తదితర అంశాలను కూడా చర్చించినట్టు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వచ్చే టీ 20 వన్డే వరల్డ్ కప్ నకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ ఇండియా పక్కాగా బరిలోకి దిగనుందనేది తేలిపోయింది.
ఈ మేరకు బీసీసీఐ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడిందని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాను ముందుండి నడిపించాలని రోహిత్ శర్మను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పట్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ను తప్పించి వేరే ఆటగాళ్లకి ఇచ్చే ఉద్దేశం కూడా బీసీసీఐకి లేదని అంటున్నారు. ఆ విషయాన్ని రోహిత్ కి క్లియర్గా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.