Maredu Tree : శివారాధన అనగానే ముందుగా గుర్తొచ్చేది మారేడు దళం. ‘త్రిదళం.. త్రిగుణాకారం.. త్రినేత్రం చ త్రియాయుధం.. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం.. శివార్పణం!!’ అనటాన్ని బట్టి మారేడుకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. శివరాత్రి నాడు తెలియకుండానే ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే పలువురు శివుని కృపకు పాత్రులయ్యారని శివపురాణం చెబుతోంది.
వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావిలి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక), దూర్వా (గరిక) పత్రాలను అష్ట బిల్వాలుగా చెబుతారు. మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ అనగా.. మా పాలకురాలు అని అర్థం. అంటే.. అన్నీ ఇవ్వగల శక్తి గల వృక్షమని అర్థం. ఈ చెట్టు పువ్వులు పూయకుండానే కాయలు కాస్తుంది. దేవతా వృక్షాల జాబితాలో ముందుండే ఈ చెట్టును లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిందని పురాణ కథనం. అందుకే మారేడు కాయను శ్రీఫలం అంటారు.
లక్ష్మీదేవి కొలువై ఉండే 5 స్థానములలో మారేడు దళం ఒకటి. సాధారణంగా మనకు మూడు దళాల మారేడు కనిపిస్తుంది. అయితే.. అరుణాచలంలో 9 దళాలుండే బిల్వపత్రాలుండే చెట్లూ కనిపిస్తాయి. పువ్వులతో పూజ చేస్తే.. తొడిమ తీసి పూజ చేస్తాం. కానీ.. మారేడు దళము కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.
శివపూజలో లింగానికి మారేడు దళపు ఈనె తగిలితే.. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. తనను మారేడు దళంతో పూజ చేసిన వారిని ఉద్దేశించి.. పరమేశ్వరుడు.. ‘త్రియాయుషం’ అంటాడట. అంటే.. బాల్యం, యవ్వనం, కౌమారం అనే మూడు దశలను చూస్తావు అని అర్థం.
మారేడు చెట్టుక్రింద శ్రద్ధగా ఎవరికైనా అన్నదానం చేస్తే.. కోటిమందికి ఒకేసారి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుందట. జీవితంలో ఒక్కసారైనా భస్మ ధారణ చేయడం, రుద్రాక్షను ధరించటం, మారేడు దళములతో శివలింగార్చన చేయటం వల్ల మోక్షం సిద్ధిస్తుందని పురాణ వచనం.