ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ తెలంగాణ సీఈసీ వికాస్రాజ్ హెచ్చరించారు . ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది తమ ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలయ్యిందని.. ఎలాంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మెటీరియల్ ప్రదర్శించకూడదన్నారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదన్నారు.
స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాలు వదిలి వెళ్లాలన్నారు వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లోకి వచ్చిందన్నారు. ఎక్కడైన ఐదుగురికి మించి గుంపు చేరితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది . ఉదయం 5.30 గంటలకే పోలింగ్ సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకోని మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల అధికారులు వెళ్తారని.. మొట్టమొదటిసారిగా ఈసారి హోం ఓటింగ్ నిర్వహించారన్నారు. ఈ సారి 27వేల 178 మంది తొలిసారిగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓటింగ్ నిర్వహించారన్నారు.
ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా సెలవు ప్రకటించామని.. ప్రైవేట్ కంపెనీలు కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు వికాస్ రాజ్ తెలిపారు. ఇక ఎన్నికల కోసం లక్షా 40వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు.. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ కార్డులను తీసుకు రావాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేసింది.